లోకేష్ పనికిరాడని చంద్రబాబే తేల్చేశారా ? బీజేపీతో దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ? సాయిరెడ్డి ట్వీట్ వార్
ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని కొన్నిరోజులుగా టీడీపీ యువనేత, ఎమ్మెల్సీ లోకేష్ సాగిస్తున్న ట్వీట్ వార్ పై ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. లోకేష్ అసహనం వెనుక కారణాలున్నాయంటూ పలు అంశాలను బయటపెట్టారు. లోకేష్ అసమర్ధుడని సొంత తండ్రే సర్టిఫై చేశాక ఆయనలో ఉద్రేకం కనిపిస్తోందంటూ సాయిరెడ్డి ఆరోపించారు. అలాగే చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలపైనా సాయిరెడ్డి తనదైన శైలిలో చురకలు అంటించారు.
ఏపీ ప్రతిపక్షాలకు ఆయుధాలిస్తున్న వైసీపీ నేతలు .. జగన్ కు తలనొప్పిగా ఎమ్మెల్యేలు,ఎంపీల వ్యాఖ్యలు
బ్లీచింగ్, మైదాల్లో ఏది రేటు ఎక్కువ ?
చంద్రబాబు తనయుడు, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ గత కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కరోనా సహాయక చర్యలతో మొదలుపెట్టి ప్రభుత్వ పథకాల వరకూ లోకేష్ చేస్తున్న విమర్శలకు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఇవాళ ట్వీట్లలో కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ లోకేష్ పేరెత్తే అర్హత లేదంటున్నారని, అంటే చిట్టినాయుడు అని పిలవమంటున్నారా అని సాయిరెడ్డి ప్రశ్నించారు. 2024లో లోకేష్ నాయకత్వంలోనే టీడీపీ ఘోరపరాజయం పాలుకానుందని ఆ పార్టీ నేతలు మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇంతకూ బ్లీచింగ్ పౌడర్ రేటు ఎక్కువా, మైదా పిండి రేటు ఎక్కువా చెప్పాలని, పోనీ కిలో పప్పు రేటెంతో చెప్పాలని సాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
చంద్రబాబే తేల్చేశాక .....
లోకేష్ బాబు ఆవేశం చూస్తుంటే ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్లే కనిపిస్తోందన్నారు. పార్టీ అధ్యక్షుడిగా తనను కాక మరొకరిని ఎంపిక చేయడం వల్ల తన్నుకొచ్చిన ఆవేదన తాలూకు ఉద్రేకం బయటపడినట్లు అనిపిస్తోందన్నారు. పనికి రాడని సొంత తండ్రే సర్ఠిపై చేస్తే తన ఫ్యూచర్ ఏంటని లోకేష్ కుంగిపోతున్నాడు పాపం అంటూ సాయిరెడ్డి ట్వీట్లలో తీవ్ర విమర్శలు చేశారు.
చంద్రబాబు అలా.. లోకేష్ ఇలా...
ఇంగ్లీష్ లో చేరిన మరో ట్వీట్ లో సాయిరెడ్డి కరోనా లాక్ డౌన్ సమయంలో తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కలిసే ఉన్నాతని.. ఈ సమయంలో లోకేష్ ఎందులోనూ ఉత్తముడు కాదని తండ్రి చంద్రబాబు తేల్చేశారని, అలాగే తండ్రి చంద్రబాబు అన్నింటిలోనూ అథముడని లోకేష్ తెలుసుకున్నారని మరింత తీవ్రమైన విమర్శలు చేశారు. తన తాజా ట్వీట్లతో చంద్రబాబు, లోకేష్ పై ఉన్న అసహనాన్ని సాయిరెడ్డి బయటపెట్టుకుంటున్నారని టీడీపీ సానుభూతిపరులు ఆయనకు కౌంటర్లు వేస్తున్నారు.
బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలంటూ...
మరో ట్వీట్లో సాయిరెడ్డి లోకేష్ తండ్రి, విపక్ష నేత చంద్రబాబుపై విమర్శలకు దిగారు. హైదరాబాద్ లో ఉన్నా చంద్రబాబు మనసంతా ఢిల్లీ చుట్టే చక్కర్లు కొడుతోందని, మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకోవడం ఎలా అనే దానిపై తీవ్రంగా వర్కవుట్ చేస్తున్నారని సాయిరెడ్డి ఆరోపించారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఈ నెల 14న తిరిగి ఏపీకి రావాలనుకుంటున్నానని, అనుమతి ఇవ్వాలని ఏపీ డీజీపీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని వదిలేసి సాయిరెడ్డి చంద్రబాబును ఢిల్లీకి లింక్ చేస్తూ ట్వీట్ చేశారు.
Recommended Video
ఎల్లో మీడియా సహకారమంటూ...
చంద్రబాబు బీజేపీకి దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఎల్లో మీడియా వంతపాడుతోదంటూ సాయిరెడ్డి తన ట్వీట్ లో విమర్శలు చేశారు. బీజేపీకి దగ్గర కావాలని తన మనుషులతో ఇప్పటికే అనిపించారని, ఎల్లో మీడియా అదొక చారిత్రక అవసరమన్నట్లు వరుస కథనాలు వండి వడ్డిస్తోందని సాయిరెడ్డి ఆక్షేపించారు. కరోనా సమయంలో చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్ చేయడం తదనంతర పరిణామాల నేపథ్యంలో సాయిరెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.