ఇసుక బొక్కిన బాబు.. గోదావరిలో రుబాబు.. తూ.గో పార్ట్-2లో విజయసాయి విసుర్లు..
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా వైఎస్ఆర్ సీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణల పర్వం కొనసాగుతోంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పట్టించుకోలేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మొన్నటివరకు విశాఖ కంటకుడి పేరుతో పార్టులు పోస్ట్ చేయగా.. తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలో కొద్ది ప్రాంతాల్లో ఉండే వనరులు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నాయని తెలిపారు. ఇక్కడ పండని పంట లేదు.. దొరకని ఖనిజం లేదన్నారు. తీరంలో మత్స్యసంపద, గ్యాస్ అపారం అని.. కానీ అలాంటి జిల్లాను కొల్ల గొట్టారని విజయసాయి విమర్శించారు.
పరిహారం ప్రకటించని బాబు..
తీరంలో గ్యాస్ పైప్ లైన్ లీకయిన సందర్భంలో పరిహారం ప్రకటించలేదని మండిపడ్డారు. కంపెనీలపై ఒత్తిడి తీసుకొచ్చి, బాధితులకు న్యాయం చేయలేదు అని విజయసాయి విమర్శలు గుప్పించారు. నీరు-చెట్టు పథకం పేరుతో ఫిఠాపురం నియోజకవర్గంలో 27 కోట్ల వరకు దోచుకున్నారని ఆరోపించారు. పథకాల పేరుతో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ధ్వజమెత్తారు. సెజ్ల కోసం 12 వేల ఎకరాల భూములను సేకరించినా.. రైతులకు మాత్రం పరిహారం ఇవ్వలేదని చెప్పారు. గోదావరి నదిలో ఇసుక తరలింపుపై ఉన్న శ్రద్ద.. పరిహారంపై మాత్రం లేదన్నారు.
కాపులకు కబుర్లు..
కాపులు అధికంగా ఉన్న జిల్లాలో కబుర్లు చెప్పి కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభాన్ని నిర్భందించారని ఆరోపించారు. కాపుల అభివృద్ధికి ఐదు వేల కోట్లు ఇస్తానని చెప్పి.. మాట తప్పారని విమర్శించారు. వ్యవసాయం దండగ అని చెప్పి..తూర్పు గోదావరి జిల్లాలో కాలువల ఆధునీకరణ చేపట్టలేదని గుర్తుచేశారు. బకింగ్ హాం కెనాల్ ను పునరుద్ధరిస్తానని చెప్పి.. పిల్ల కాలువల్లో పూడికలు కూడా తీయలేదన్నారు. 1915లో పెద్దాపురం మున్సిపాలిటీ అని.. భీమిలి తర్వాత పురాతన మున్సిపాలిటీలో మంచి నీటి సమస్యను కూడా తీర్చలేదని ధ్వజమెత్తారు.
నిధులు దారి మళ్లింపు..
కాకినాడలో రైస్ మిల్లర్లు, రైతుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదన్నారు. మత్స్యకారుల సమస్యలను కూడా పట్టించుకోలేదన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దారిమళ్లించాడని ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లాలో మరిన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.