విశాఖ ఎయిర్పోర్టు 30 ఏళ్ల పాటు మూసేయండి- కేంద్రాన్ని కోరిన సాయిరెడ్డి- ఎందుకంటే ?
విశాఖపట్నంలోని అంతర్జాతీయ విమనాశ్రయాన్ని 30 ఏళ్లపాటు మూసేయాలని కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. చదవడానికి విచిత్రంగా అనిపిస్తున్నా ఇదే నిజం. అయితే ఇందుకో ఓ ట్విస్ట్ ఉంది. కేంద్రానికి విజయసాయిరెడ్డి చేసిన విజ్ఞప్తి వెనుక ఓ సమంజసమైన కారణం కూడా ఉంది. దీంతో ఇప్పుడు ఆయన విజ్ఞప్తి కేంద్రం పరిశీలనలో ఉంది.
విశాఖపట్నంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. అయితే ఇది ఇక్కడి తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో పనిచేస్తోంది. దీంతో ఎప్పటి నుంచో స్వతంత్రంగా ఓ ఎయిర్పోర్టు ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాయి. కానీ ముందడుగు మాత్రం పడలేదు. తాజాగా విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు జీఎంఆర్ సంస్ధకు కాంట్రాక్టు కూడా అప్పగించింది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఇక విశాఖ విమానాశ్రయం వెళ్లాల్సిన అవసరం ఉండదు.
భోగాపురం ఎయిర్పోర్టు అందుబాటులోకి వచ్చాక విశాఖ ఎయిర్పోర్టుకు ఎలాగో ట్రాఫిక్ తగ్గిపోతుంది. అయినా భోగాపురం ఎయిర్పోర్టు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుంటే పక్కనే మరో ఎయిర్పోర్టు పౌర అవసరాలకు అందుబాటులో ఉండటం సరికాదు.
అందుకే వైసీపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్టు మొదలు కాగానే విశాఖ ఎయిర్పోర్టు సివిల్ ఎన్క్లేవ్ను 30 ఏళ్లపాటు మూసేయాలని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి వినతిపత్రం అందించారు.