గంటాపై సైకిళ్ల స్కామ్: బ్లాక్లిస్ట్లో ఉన్న కంపెనీకి కాంట్రాక్టు: YCPఎమ్మెల్యే లేఖ..ఎంపీ వార్నింగ్
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి గంటా శ్రీనివాస రావు సైకిళ్ల కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో అర్హులైన విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేయడానికి అర్హత లేని కంపెనీకి సైకిళ్ల సరఫరాను అప్పగించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్ ప్రభుత్వం బ్లాక్లిస్ట్లో పెట్టిన ఎస్కే బైక్స్ సంస్థకు సైకిళ్ల పంపిణీ పనులను ఇచ్చారని, దీనికోసం భారీ ఎత్తున ముడుపులను అందుకున్నారంటూ ఆరోపిస్తున్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.
దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విద్యాశాఖ అధికారులకు లేఖ రాశారు. పంజాబ్లోని లుధియానాకు చెందిన ఎస్కే బైక్స్ సంస్థను గుజరాత్ ప్రభుత్వం బ్లాక్లిస్టులో పెట్టిందని అన్నారు. నాసిరకమైన సైకిళ్లను పంపిణీ చేస్తోందనే కారణంతో గుజరాత్ హైకోర్టు.. ఎస్కే బైక్స్ సంస్థను బ్లాక్లిస్టులో పెట్టిందని, అలాంటి సంస్థ నుంచి చంద్రబాబు ప్రభుత్వం సైకిళ్లను కొనుగోలు చేసిందని చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. అప్పట్లో విద్యాశాఖ మంత్రిగా పని చేసిన గంటా శ్రీనివాస రావు పెద్ద ఎత్తున కమీషన్లను అందుకున్నారని విమర్శించారు.
దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గుజరాత్ ప్రభుత్వం అమలు చేసిన సరస్వతి సాధనా సహాయ్ యోజన, గరీబ్ కల్యాణ్ మేళా పథకాల కింద గుజరాత్ రూరల్ ఇండస్ట్రీస్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (గ్రిమ్కో) రెండున్నర లక్షల సైకిళ్లను ఎస్కే బైక్స్ నుంచి కొనుగోలు చేసిందని, అవన్నీ నాసిరకంగా ఉన్నాయంటూ మెహసానా జిల్లా పంచాయతీ సభ్యుడు కేశూభాయ్ పటేల్ దాఖలు చేసిన పిల్పై విచారించిన అనంతరం ఆ రాష్ట్ర హైకోర్టు ఆ సంస్థను బ్లాక్లిస్టులో పెట్టిందని అన్నారు. అలాంటి సంస్థ నుంచి చంద్రబాబు ప్రభుత్వం సైకిళ్లను కొనుగోలు చేసిందని అన్నారు.
Recommended Video
ఇదే విషయంపై వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి కూడా ట్వీట్ చేశారు. సైకిళ్ల కొనుగోలులో గంటా శ్రీనివాస రావు అయిదు కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 12 కోట్ల రూపాయల విలువ చేసే సైకిళ్ల పంపిణీ పథకంలో అయిదు కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుందని విమర్శించారు. ఎస్కే బైక్స్ నుంచి సైకిళ్లను కొనుగోలు చేయొద్దని, దాన్ని బ్లాక్లిస్టులో పెట్టినప్పటికీ.. బ్లాక్ మనీ కోసం స్కామ్కు పాల్పడ్డారని అన్నారు. ఎస్కే బైక్స్ సంస్థ నుంచి పెద్ద ఎత్తున కమీషన్లను అందుకున్నారని ఆరోపించారు.