Vijayasai Reddy: చంద్రబాబు బినామీలను జల్లెడ పడితే రూ.10 లక్షల కోట్లు దొరకొచ్చు
అమరావతి: ప్రస్తుతం రాఫ్ట్ర రాజకీయాల్లో సునామీని సృష్టిస్తోన్న అంశం.. ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఏకకాలంలో చోటు చేసుకున్న ఐటీ దాడులు తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వానికి ఇరుకున పెట్టేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ దాడుల సందర్భంగా 2000 కోట్ల రూపాయల లెక్క చూపని నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Vijayasai Reddy: పవన్ ఢిల్లీ టూర్: యజమాని ఆదేశించాడు ..ప్యాకేజీ స్టార్ పాటించాడు: సెటైర్లు..!
ఈ నగదు మొత్తం టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్కు చెందినదిగా అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే ఆయనను అదుపులోకి తీసుకుని, సమగ్ర విచారణ కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం కాస్తా తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రత్యర్థులకు అయాచిత అస్త్రంలా మారింది. టీడీపీ నాయకులు ఏ రేంజ్లో దోపిడీకి పాల్పడ్డారనేది ఐటీ దాడులతో తేటతెల్లమైందనే ఆరోపణలు, విమర్శలు ఊపందుకుంటున్నాయి.
పెండ్యాల శ్రీనివాస్ నివాసంపై ఆరు రోజుల పాటు ఏకధాటిగా దాడులను కొనసాగించిన అనంతరం 2000 కోట్ల రూపాయల మేర లెక్క చూపని నగదును గుర్తించడంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘాటు విమర్శలకు తెర తీసింది. ఆ పార్టీ నాయకులు టీడీపీపై మాటల తూటాలను సంధిస్తున్నారు. ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ గానీ, పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ స్పందించలేదు.
ఈ ఐటీ దాడుల ఉదంతంపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలను చేశారు. చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి ఇళ్లను సోదాలు చేస్తేనే వేల కోట్ల రూపాయల నల్ల ధనం బయట పడిందని, ఇక ఆయన బినామీలు, కాంట్రాక్టర్ల నివాసాల, కార్యాలయాలపై దాడులు చేస్తే కనీసం 10 లక్షల కోట్ల రూపాయలయినా దొరుకుతాయని అన్నారు.
14 సంవత్సరాల పాటుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చంద్రబాబు.. తాను పరిపాలన కొనసాగించినన్ని రోజులు బినామీలు, కాంట్రాక్టు సంస్థలను పెంచి పోషించారని విమర్శించారు. వాటిని జల్లెడ పట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పుడు దొరికిన మొత్తం కేవలం ఉల్లిపాయ పైపొర మాత్రమేనని, దాడులను విస్తృతం చేసే కొద్దీ 10 లక్షల కోట్ల రూపాయలు దొరుకుతాయని సాయిరెడ్డి అన్నారు. చంద్రబాబుకు ఉన్న నెట్వర్క్ను చూసి, ముంబై కార్పొరేట్ సంస్థలు సైతం బిత్తరపోతున్నాయని ఎద్దేవా చేశారు.