ఆయనది మామూలు గుండె కాదు.. కొండపై నుంచి జారిపడుతూ మధ్యలో..
ఒక పెద్ద కొండ.. దానిపై నుంచి ఓ వ్యక్తి పట్టుతప్పి పడిపోయాడు.. కిందికి జారిపోతుండగా.. మధ్యలో ఓ చెట్టుకొమ్మ ఆసరాగా దొరికింది.. కానీ ఆ కొమ్మ అంతబలంగా లేదు.. ఏ క్షణంలోనైనా విరిగిపోవచ్చు.. ఆ వ్యక్తి అగాథంలో పడిపోవచ్చు.. అలాంటి నిస్సహాయతలోనూ ఎవరైనా ధీమాగా ఉండగలరంటే ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒక్కరే.. నిజానికది ధైర్యం కాదు.. పెద్ద డిజార్డర్.. అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.
పర్సనల్ అటాక్..
టీడీపీ అధినేత చంద్రబాబుపై దాదాపు ప్రతిరోజూ రాజకీయ ఆరోపణలు చేసే వైసీపీ ఎంపీ విజయసాయి.. గురువారం మాత్రం వ్యక్తిగత విమర్శలకు దిగారు. బాబు మానసిక స్థితి బాగోలేదని, ప్రపంచంలోనే అరుదైనదిగా భావించే ఓ రుగ్మతతో బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు వరుస ట్వీట్లతో విజయసాయి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
దటీజ్ సీబీఎన్
‘‘కొండపై నుంచి జారిపడుతూ మధ్యలో కొమ్మను పట్టుకుని వేలాడుతున్న పరిస్థితి చంద్రబాబుది. ఏ క్షణంలోనైనా కొమ్మ విరగొచ్చు లేదా పట్టుతప్పి తానే అగాథంలోకి పడిపోవచ్చు. అంత నిస్సహాయతలో కూడా ‘ఒక్కొక్కరి భరతం పడతా, ఎవర్నీ వదిలి పెట్టేది లేదు' అని బెదిరిస్తున్నాడంటే ఆయనది మామూలు ‘గుండె' కాదు''అని విజయసాయి పేర్కొన్నారు.
బాబుకు జబ్బు..
అగాధంలోకి పడిపోతూ కూడా అవతలివాళ్లను భయపెట్టాలని చూస్తోన్న చంద్రబాబు నిజానికి పెద్ద మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని, దాని పేరు నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్(Narcissistic personality disorder)అని వైసీపీ ఎంపీ తెలిపారు. సదరు డిజార్డర్ తో బాధపడేవాళ్లు.. తాము లేకపోతే ప్రపంచమే లేదనే భ్రాంతిలో బతుకుతారని, తాము తప్ప మిగతావాళ్లందరూ పనికిమాలిన వారనే భావనతో ఉంటారని, నిత్యం హింసను ప్రేరేపించేలా మాట్లాడటం, నేరాలను ప్రోత్సహించడం లాంటి లక్షణాలు కలిగి ఉంటారని వివరించారు.
ఫ్లెక్సీల స్థాయికి దిగిపోయారు..
14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. ప్రజల్ని బిచ్చగాళ్లతో పోల్చడం దారుణమని, ఆఖరికి వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీల ఫ్లెక్సీలపైనా స్పందించేస్థాయికి దిగజారిపోయారని ఎంపీ విజయసాయి మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఎక్కువకు కోట్ చేసి, జనం డబ్బులు లూటీ చేశారని, అదే సీఎం జగన్ మాత్రం ఒక్క రివర్స్ టెండరింగ్ విధానంతోనే రాష్ట్రానికి రూ.2వేల కోట్లు ఆదా చేశారని విజయసాయి గుర్తుచేశారు.
బాబుపై విశాఖలో దాడి..
రెండ్రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కోసం గురువారం విశాఖపట్నం వచ్చిన చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. వైజాగ్ ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు, కోడిగుడ్లు విసిరి వైసీపీ రచ్చచేసింది. పోలీసులు, టీడీపీ కార్యకర్తలతోనూ వైసీపీ కార్యకర్తలు తోపులాటకు దిగారు. బాబు పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతిచ్చారు. విశాఖ జిల్లా పెందుర్తిలో భూములు కోల్పోయిన రైతులను కలుసుకోనున్న చంద్రబాబు.. శుక్రవారం విజయనగరంలో పర్యటిస్తారు.