విశాఖ రేవ్ పార్టీకి టీడీపీకి లింక్ పెట్టిన బీజేపీ.. సీఎం మేజిక్ షో చేస్తున్నాడంటూన్న వైసీపీ.
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిని లక్ష్యంగా చేసుకున్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు. మొన్నటిదాకా- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చంద్రబాబు తీరుపై విమర్శలు గుప్పిస్తూ వస్తుండగా.. తాజాగా భారతీయ జనతాపార్టీ కూడా తోడైంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అనుసరిస్తోన్న వైఖరిని ఈ రెండు పార్టీల నాయకులు తప్పు పడుతున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి ఎలాంటి సమీక్షలను గానీ, సమావేశాలను గానీ నిర్వహించాల్సిన అధికారం లేకపోయినప్పటికీ.. చంద్రబాబు దీనికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్నికల ఫలితాలకు నిర్దేశించిన గడువు సమీపిస్తున్న కొద్దీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిలో అసహనం అమాంతంగా పెరిగిపోతోందంటూ చురకలు అంటిస్తున్నారు.
మంత్రివర్గం భేటీ పేరుతో రోప్ ట్రిక్..
మంత్రివర్గం సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను స్వయంగా వెళ్లి పర్యవేక్షిస్తానని అంటూ చంద్రబాబు రోప్ ట్రిక్లను ప్రయోగిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. మేజిక్ షో ముగిసిపోవడానికి కొన్ని క్షణాల ముందు ఇంద్రజాలికులు ఇండియన్ రోప్ ట్రిక్ అనే గారడీ విద్యను ప్రయోగిస్తారని, చంద్రబాబు ప్రవర్తన కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదని అన్నారు. తాడు కొస పాములా పైకి వెళ్తుండగా.. దాన్ని పట్టుకుని ఇంద్రజాలికుడి సహాయకుడు పైకి ఎగబాకుతుంటారని, ప్రస్తుతం చంద్రబాబు కూడా కేబినెట్ మీటింగ్ పేరుతో ‘రోప్ ట్రిక్' కు సిద్ధమయ్యారని విమర్శించారు. ఈ ట్రిక్ పనిచేస్తుందా? లేదా? అనేది తెలియడానికి ఈ నెల 23వ తేదీ వరకు వేచి చూడక తప్పదని అన్నారు. చంద్రబాబు విసిరే తాడు పైకి ఎగురుతుందో? కిందకు జారి పడుతుందో ఎవరికీ తెలియదని చెప్పారు.
చంద్రబాబును సీఎస్ రిపోర్ట్ చేయకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టా?
ప్రతి చిన్న విషయానికీ చంద్రబాబు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే పడిగట్టు పదాన్ని ప్రయోగిస్తున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపులో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ చంద్రబాబు దేశమంతా గగ్గోలు పెడుతున్నారని, అయినప్పటికీ. ఆయనను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని గుర్తు చేశారు. అయినప్పటికీ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనను రిపోర్ట్ చేయట్లేదని, తనను లెక్క పెట్టట్లేదని చంద్రబాబు అక్కసుతో ఉన్నారని ఆరోపించారు. దీనివల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చంద్రబాబు చెప్పడంలో అర్థమే లేదని ధ్వజమెత్తారు. `ఎన్నికలంటే ఏమిటి? ఎవరో డబ్బు సమకూరుస్తారు, ఇంకొకరు ఖర్చుపెట్టి గెలుస్తారు` అంటూ చంద్రబాబు ఎన్నికలకు కొత్త అర్థాన్ని ఇచ్చారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని సాయిరెడ్డి అన్నారు. `ఆ నోటితో విలువల గురించి మాట్లాడటమేమిటి చంద్రబాబూ? ఓడిపో యే ముందు అసహనం అమాంతం పెరిగినట్టుంది.. ` అని విమర్శించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాస్తవిక నివేదిక..
ఫొని తుఫాన్ మిగిల్చిన నష్టంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్రానికి వాస్తవిక నివేదికను అందజేశారని విజయసాయి రెడ్డి ప్రశంసించారు. చంద్రబాబు హయాంలో లేని నష్టాన్ని కూడా చూపే వారని విమర్శించారు. 2800 ఎకరాల్లో పంట, రెండువేల విద్యుత్ స్థంబాలు, 117 సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాస్తవిక నివేదికను కేంద్రానికి పంపించారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం లేకపోవడం వల్ల అధికార యంత్రాంగం స్వేచ్ఛగా, వేగంగా పనిచేసిందని ఆయన కితాబిచ్చారు.
చంద్రబాబు..తుపాకీ రాముడు
చంద్రబాబును తుపాకీ రాముడితో పోల్చారు విజయసాయి రెడ్డి. అధికార యంత్రాంగం రేయింబవళ్లు తుఫానుకు ఎదురొడ్డి ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకుందని, వారిని అభినందించాల్సిన చంద్రబాబు వాళ్ల క్రెడిట్ను కూడా తానే కొట్టేస్తున్నారని విమర్శించారు. తుఫాన్కు ముందు, ఆ తరువాత జిల్లాల కలెక్టర్లు, పాలనా యంత్రాంగం, క్షేత్రస్థాయి సిబ్బంది స్పందించిన తీరు ప్రశంసనీయం అని చెప్పారు. `థాంక్యూ సిఎం అని హోర్డింగులు పెట్టుకోలేక పోయాననే బాధ చంద్రబాబును వేధిస్తోందని అన్నారు. తుఫాను సహాయ చర్యలకు తమ హెల్ప్ కావాలంటే చెప్పాలని ఒరిస్సా సిఎంను చంద్రబాబు అడిగారట. గతంలో తిత్లీ తుఫాను తీరం దాటక ముందే ‘థ్యాంక్యూ సిఎం సార్, తుఫాను నుంచి మా ప్రాణాలు రక్షించినందుకు' అని సొంతంగా హోర్డింగులు పెట్టించుకున్నట్టే ఉంది ఈ వ్యవహారం కూడా అని సాయిరెడ్డి ధ్వజమెత్తారు.
ప్రభుత్వ కనుసన్నల్లో రేవ్ పార్టీ: విష్ణుకుమార్ రాజు
విశాఖపట్నంలో ఇటీవలే వెలుగులోకి వచ్చిన రేవ్ పార్టీ ఉదంతం వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని బీజేపీ సభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు విమర్శించారు. ఆదివారం ఆయన విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో రేవ్ పార్టీ కొనసాగిందని అన్నారు. విశాఖను డ్రగ్స్ అడ్డాగా మార్చేశారని ఆరోపించారు. జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు అండదండలు చూసుకునే నిర్వాహకులు యథేచ్ఛగా రేవ్ పార్టీ నిర్వహించారని ధ్వజమెత్తారు. రేవ్ పార్టీల విష సంస్కృతిని విశాఖవాసులకు పరిచయం చేస్తున్నారని, ప్రశాంతంగా ఉన్న మన్యంలో చిచ్చు పెడుతున్నారని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.