కమ్మనైన ప్రజాస్వామ్యం: నాలుగో బిగ్బాస్ వివరాలు అతి త్వరలో..స్టే ట్యూన్డ్: సాయిరెడ్డి
అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో బీజేపీ నాయకులు, కేంద్ర, రాష్ట్ర మాజీమంత్రులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ భేటీ కావడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విరుచుకు పడుతున్నారు. నిమ్మగడ్డ రమేష్కుమార్తో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఎలాంటిదో ఈ ఉదంతంతో వెలుగు చూసిందని ఘాటు విమర్శలు చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్తో బీజేపీ నేతలకు పనేంటని నిలదీస్తున్నారు.
మిషన్ పార్క్ హయత్?: నిమ్మగడ్డతో బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ రహస్యభేటీ?..
పార్క్ హయత్ హోటల్లో
నిమ్మగడ్డ రమేష్కుమార్, కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లోనికి వెళ్తోన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ నెల 13వ తేదీన ఆ ముగ్గురు నాయకులు పార్క్ హయత్ హోటల్లో కలుసుకున్నట్లు ఈ సీసీటీవీ ఫుటేజీ స్పష్టం చేస్తోంది. ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలను పుట్టిస్తోంది. వైఎస్ఆర్సీపీ నేతలు దీనిపై నిప్పులు చెరుగుతున్నారు.
కమ్మనైన ప్రజాస్వామ్యం
హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో కమ్మనైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ రమేష్కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్.. ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులనే విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఈ సమావేశం వల్ల ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు.
నాలుగో బిగ్బాస్ ఎవరు?
ఈ దుష్ట చతుష్టయంలో నాలుగో వ్యక్తి ఎవరనేది త్వరలోనే తేలుతుందని అన్నారు. వారితో మాట్లాడిన నాలుగో బిగ్బాస్ ఎవరు? అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలతో అతి త్వరలోనే బహిర్గతమౌతాయని చెప్పారు. చీకటి సంబంధాలు, రహస్య ఒప్పందాలు, లోపాయకారి పొత్తులు.. ఇవన్నీ ఎక్కువ కాలం కొనసాగబోవని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఏదో ఒకరోజు వారి పాపాలు బద్దలవుతాయని, ఇందులో భాగంగానే.. ముగ్గురు దొంగలు బయటపడ్డారని ఎద్దేవా చేస్తున్నారు.
Recommended Video
నిమ్మగడ్డతో రాజకీయ పార్టీ నేతలకు సాన్నిహిత్యం..
నిమ్మగడ్డ రమేష్కుమార్కు తెలుగుదేశం, బీజేపీ నేతలతో ఏ స్థాయిలో సాన్నిహిత్యం ఉందనే విషయం ఈ భేటీతో తేటతెల్లమైందని వైసీపీ సీనియర్ నాయకుడు ఆరోపిస్తున్నారు. మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీలో కొనసాగిన సుజనా చౌదరి హఠాత్తుగా బీజేపీలో చేరడానికి ప్రధాన కారణం.. తాను చేసే చట్ట వ్యతిరేక పనుల వల్ల టీడీపీకి మరక అంటకూడకపోవడమేనని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేంద్రంలో ఆయన మంత్రిగా పని చేశారని గుర్తుచేశారు. అలాగే- కామినేని శ్రీనివాస్ కూడా చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారని అన్నారు.