ఫైబర్గ్రిడ్ స్కామ్: నిజం కక్కిన నారా లోకేష్: చంద్రబాబును ఇరికించేలా: బాంబు పేల్చిన సాయిరెడ్డి
అమరావతి: రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోన్న ఏపీ ఫైబర్గ్రిడ్ కుంభకోణం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇదివరకు ఈ కుంభకోణంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్కు చెందిన పేస్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో..తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహించిన మాజీమంత్రి నారా లోకేష్ చేసిన తాజా ప్రకటన కలకలాన్ని రేపింది.
ఏపీ ఫైబర్గ్రిడ్ కుంభకోణంలో ఐటీ మంత్రికి ఏ మాత్రం సంబంధం లేదంటూ ఆ శాఖ మాజీమంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటన పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి పలు అనుమానాలను లేవనెత్తారు. ఐటీ శాఖ ఆధీనంలో ఉండే ఏపీ ఫైబర్గ్రిడ్ సంస్థలో చోటు చేసుకున్న స్కామ్తో ఆ శాఖ మంత్రికి సంబంధం లేకపోతే.. మరెవరికి ఉందని ఆయన ప్రశ్నించారు.
పవన్ కు చంద్రబాబు సంఘ సంస్కర్త , మహానేత.. ఆయనంటే ప్రేమ.. పవన్ పై కన్నబాబు సెటైర్లు
ఏపీ ఫైబర్గ్రిడ్లో కుంభకోణం చోటు చేసుకుందనే విషయాన్ని నారా లోకేష్ పరోక్షంగా అంగీకరించినట్టేనని అన్నారు. అవినీతి జరిగిందనే విషయాన్ని నారా లోకేష్ కక్కేశారని చెప్పారు. ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్కు ఈ స్కామ్తో సంబంధం లేకపోతే.. ఆయన తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో నారా లోకేష్ తన తండ్రినే ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను దొంగిలించిన ఆరోపణలను ఎదుర్కొంంటోన్న హరిప్రసాద్.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ సలహాదారుగా వ్యవహరించిన విషయాన్ని విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. హరిప్రసాద్ను ఐటీ సలహాదారుగా ఎవరు నియమించారనే విషయంపై దృష్టి సారించాల్సి ఉందని అన్నారు. ఆయనను ఐటీ సలహాదారుగా నియమించిందెవరో నారా లోకేష్ వెల్లడించాలని సాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ ఫైబర్గ్రిడ్లో చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తోన్న కుంభకోణం, అవినీతి కార్యకలాపాలపై సీబీఐ దర్యాప్తు నిర్వహించాలని కొద్దిరోజుల కిందటే రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించిన విషయం తెలిసిందే.