ఏపీలో కరోనా: జనసేనతో వైసీపీ పొత్తు.. చిరంజీవి పేరును ప్రస్తావిస్తూ విజయసాయి అనూహ్య కామెంట్లు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తిపై వెల్లువెత్తుతోన్న రాజకీయ విమర్శలు పీక్స్ కు చేరాయి. కరోనా కట్టడిలో సీఎం జగన్ ఫెయిలయ్యారంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆరోపించడాన్ని తప్పుపడుతూ వైసీపీ ఎంపీ విజయసాయి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిగా మెగా బ్రదర్ నాగబాబు కూడా అదే స్థాయిలో ఎంపీకి కౌంటరిచ్చారు. ఈ వివాదాన్ని మరింత పొడగిస్తూ మళ్లీ మాటలదాడికి దిగిన విజయసాయి.. ఈసారి మెగాస్టార్ చిరంజీవి పేరునూ ప్రస్తావించడం గమనార్హం.
అసలేం జరిగిందంటే..
లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు ఆర్థిక సాయంగా ప్రకటించిన రూ.1000ని అధికార వైసీపీ నేతలు పంచడంపై ఏపీలో వివాదం చెలరేగింది. వైసీపీ తీరును తప్పుపట్టినప్పటికీ.. ఇది విపత్కర తరుణం కాబట్టి రాజకీయాల జోలికి వెళ్లడంలేదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి స్పందిస్తూ.. ‘‘అసలు పవన్ కు పొలిటికల్ గ్రౌండే లేదు, పైగా స్వీయ నియంత్రణ ఏంటి?''అని ఎద్దేవా చేశారు. ఆ వెంటనే మెగా బ్రదర్ నాగబాబు ముందుకొచ్చి.. ఇలాంటి వెధవ రాజకీయాలకు తప్ప ఎందుకూ పనికిరాడని, గతంలో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పవన్ కల్యాణ్ తో పొత్తు కోసం ప్రయత్నించిన గుంట నక్క విజయసాయి అని విమర్శించారు. ఆ వ్యాఖ్యలపైనే ఎంపీ మళ్లీ స్పందించారు..
జనసేనతో పొత్తు కల..
నాగబాబు ఆరోపించినట్లు.. వైసీపీ ఏనాడూ జనసేనతో పొత్తు కోసం ప్రయత్నించలేదని ఎంపీ విజయసాయి క్లారిటీ ఇచ్చారు. నిజానికి జనసేన పార్టీ.. చంద్రబాబు కోసమే, ఆయనిచ్చిన ప్యాకేజీలతోనే పుట్టిందని, పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి నుంచి పవన్ ఎవరి కోసం తోక ఊపుకుంటూ మాట్లాడాడో ప్రజలందరికీ తెలుసని ఎంపీ మండిపడ్డారు. ‘‘అలాంటి పార్టీతో వైసీపీ పొత్తు కోరుకుంటున్నదని కలేమైనా వచ్చిందా? పవన్ కల్యాణ్ రెండు చోట్లా చిత్తుగా ఓడిపోతాడని అందరికీ ముందే తెలుసు''అని ఫైరయ్యారు.
చిరు లేకపోతే..
గతానికి భిన్నంగా ఎంపీ విజయసాయి.. తొలిసారి చిరంజీవి పేరును ప్రస్తావిస్తూ మెగా బ్రదర్స్ పై విరుచుపడటం గమనార్హం. నాగబాబు విమర్శల్ని ప్రస్తావిస్తూ.. ‘‘పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చింది. సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికి వదిలేసిన వాళ్లకు అసలు రాజకీయాలెందుకు? 2014లోనే వైసీపీ పొత్తులకు దూరంగా ఉంది. సింగిల్ గానే పోటీచేస్తామని, అదే వైసీపీ విధానమని మా అధినేత జగన్ స్పష్టంగా ప్రకటించారు. అయినా, చిరంజీవి తమ్ముళ్లు కాకపోతే వీళ్లను చూసి కుక్కలు కూడా మొరగవు''అని విమర్శించారు.
వాటే గ్రేట్ ఫాల్..
కరోనా వైరస్ ను అరికట్టడంలో వైసీపీ ప్రభుత్వం ఫెయిలైందంటూ విమర్శలు చేసిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్, నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవడం, ఇదే కరోనాను సాకుగా చూపి ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పించడం తెలిసిందే. ఈ ముగ్గురి విషయంలో పోరాటం చేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రకటించడాన్ని వైసీపీ ఎంపీ తప్పుపట్టారు. ‘‘ప్రతిపక్ష నేతగా ఐదు కోట్ల మంది తరఫున మాట్లాడాల్సిన వ్యక్తి.. తన భ్రమరావతి కోసం మూడు గ్రామాలకు పరిమితమయ్యాడు. ఇప్పుడు ముగ్గురు వ్యక్తుల ఉద్యోగాల కోసం పోరాటం చేస్తానంటున్నాడు. తద్వారా తన 40 ఇయర్స్ ఇండస్ట్రీ పరిధిని తానే కుదించుకుంటున్నాడు. వాటే గ్రేట్ ఫాల్!'' అని విజయసాయి మండిపడ్డారు.
ఇవీ రాష్ట్రంలో లెక్కలు..
ఇప్పటి వరకు ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 405కు పెరిగాయి. వాళ్లలో 11 మందికి వ్యాధి నయంకాగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 82 కేసులు, గుంటూరులో 75 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రభుత్వం.. అక్కడ తప్ప మిగతా చోట్ల లాక్ డౌన్ కు సడలింపు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది.
Recommended Video