దుర్గమ్మ గుడిలో క్షుద్రపూజలు..అంతర్వేది రథానికి నిప్పు: మూలకారకుడు ఆయనే: సాయిరెడ్డి
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి చెందిన రథం మంటల్లో దగ్ధమైన ఘటన రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని రాజకీయ ప్రత్యర్థులు చెలరేగిపోతున్నారు. ఘాటు విమర్శలకు దిగుతున్నారు. మతం రంగునూ పులిమే ప్రయత్నం చేస్తున్నారు. రోజురోజుకూ విమర్శల తీవ్రత పెరిగిపోతుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ అటాక్కు దిగింది.
అంతర్వేది ఘటనలో ట్విస్ట్: సీనియర్ ఐఎఎస్ అధికారిపై బదిలీ వేటు: ఈఓ సస్పెన్షన్: మరో రచ్చ
తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రత్యారోపణలు చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న సంఘటనలను ఏకరువు పెడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులకు రవాణా సౌకర్యాన్ని కల్పించాలనే పేరుతో అడ్డుగా ఉన్న దేవాలయాలను చంద్రబాబు ప్రభుత్వం తొలగించిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనక దుర్గమ్మ అమ్మవారి ఆలయం గర్భగుడిలో చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న క్షుద్రపూజల ఉదంతాన్నీ ప్రస్తావనలోకి తీసుకొస్తున్నారు.
చంద్రబాబు బూట్లు వేసుకుని పూజలను నిర్వహించిన సందర్భాన్ని తెర మీదికి తీసుకొస్తున్నారు. కలియుగ వైకుంఠం తిరుమలలో రాయలవారి హయాంలో నిర్మించిన వేయి కాళ్లమండపాన్ని చంద్రబాబు ప్రభుత్వంలోనే తొలగించారని ప్రత్యారోపణలకు దిగుతున్నారు. హిందుత్వంపై దాడి చోటు చేసుకోవడానికి మూల కారకుడు చంద్రబాబేనని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. దుర్గమ్మ గుడిలో క్షుద్రపూజలను చేయించిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు.
అంతర్వేదిలో రథానికీ నిప్పు ఆయనే పెట్టించాడని మండిపడ్డారు. చంద్రబాబుకు పాప భీతి, దైవ భక్తి ఏ మాత్రం లేదని సాయిరెడ్డి ధ్వజమెత్తారు. కాపు రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా ముద్రగడ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లా తునిలో బహిరంగ సభను నిర్వహించిన సమయంలో చంద్రబాబు రైలును తగుల బెట్టించాడని ఆరోపించారు. అమరావతి నిర్మాణానికి భూములను ఇవ్వని రైతుల తోటలకు నిప్పు పెట్టించిన విషయాన్ని ఎవరూ విస్మరించబోరని అన్నారు.
కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో అనేక గుడులు కూల్చి వేశారని అన్నారు. దేశం మొత్తం ఈ ఘటన పట్ల స్పందించిందని పేర్కొన్నారు. అమరేశ్వరుడి భూములు మింగేశారని సాయిరెడ్డి విమర్శించారు. గోదావరి, కృష్ణా పుష్కరాల పేరుతో ఏడు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు ఆరగించారని ఎదురుదాడి చేశారు. పాప భీతి గానీ, దైవ భక్తి లేని వ్యక్తి చంద్రబాబు అని, హిందుత్వం జరుగుతోన్న దాడులకు మూలకారకుడు ఆయనేనని సాయిరెడ్డి విమర్శించారు.