కేంద్రంపై వైసీపీకి పెరుగుతోన్న పట్టు..ప్రాధాన్యత: విజయసాయి రెడ్డికి కీలక పదవి
అమరావతి: హస్తినలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టు పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. దేశంలోనే నాలుగో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన వైఎస్ఆర్సీపీకి దానికి అనుగుణంగానే ప్రాధాన్యత దక్కుతోంది. వైఎస్ఆర్సీపీ నుంచి నలుగురు సభ్యులు రాజ్యసభకు కొత్తగా ఎన్నిక కావడంతో ఆ పార్టీ సంఖ్య పెరిగింది. ప్రస్తుతం రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి ఆరుమంది సభ్యుల బలం ఉంది. ఈ సంఖ్య మున్ముందు మరింత పెరుగుతుంది.
3 రాజధానుల గెజిట్ నోటిఫికేషన్పై స్టే కోసం: పరిరక్షణ సమితి ఎంట్రీ: చివరి యత్నం: ఎప్పుడంటే?
ఈ పరిణామాల మధ్య వైసీపీకి మరో కీలక పదవి లభించింది. రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)లో చోటు దక్కింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వీ విజయసాయి రెడ్డి బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమితులు అయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రెటేరియట్ ఓ బులెటిన్ను విడుదల చేశారు. విజయసాయి రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి మల్లికార్జున ఖర్గె, ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా, శివ్ ప్రతాప్ శుక్షాలను బిజినెస్ అడ్వైజరీ కమిటీలోకి తీసుకున్నారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు వారిని నామినేట్ చేశారు.
ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి ఆరుమంది సభ్యుల బలం ఉంది. ఇదివరకే విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సభ్యులుగా కొనసాగుతున్నారు. జూన్ 19వ తేదీన నిర్వహించిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ నుంచి మరో నలుగురు ఎన్నికయ్యారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్యా రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ వైసీపీ సభ్యులుగా ఉన్నారు. వైసీపీకి ఉన్న బలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీకి చెందిన సభ్యుడికి బీఏసీలో చోటు కల్పించారు.
Recommended Video
రాజ్యసభ కార్యకలాపాల నిర్వహణలో బీఏసీ కీలక పాత్ర వహిస్తుంది. రాజ్యసభ సమావేశాలు మొదలుకుని అన్ని అంశాల్లోనూ ఈ అడ్వైజరీ కమిటీ సభ్యులు తమ సూచనలు, సలహాలను అందిస్తారు. దీనికి అనుగుణంగా షెడ్యూల్ను నిర్ధారిస్తారు. సభను ఎన్ని రోజులపాటు కొనసాగించాలి? ఎంత సమయాన్ని కేటాయించాలి? వంటి అంశాలను బీఏసీ నిర్ధారిస్తుంది. అలాంటి కమిటీలో వైసీపీకి చోటు దక్కడం.. ఆ పార్టీకి ఉన్న ప్రాధాన్యతను చాటుతోంది.