కేంద్రమంత్రి సీతారామన్తో విజయసాయి రెడ్డి భేటీ-టీటీడీకి జీఎస్టీ మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గురువారం(జూన్ 24) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి(టీటీడీ) జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రిని ఎంపీ విజయసాయి కోరారు. గతంలో విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(వుడా) చెల్లించిన రూ.219 కోట్లు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.
మరోవైపు,రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్తో భేటీ అయ్యారు. ఏపీలో భారత్ నెట్ పనులు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రిని బుగ్గన కోరారు.రాష్ట్రంలో ప్రతీ గ్రామాన్ని ఇంటర్నెట్తో అనుసంధానించాల్సి ఉందని... ఇందుకోసం పీపీపీ పద్దతిలో పనులు మొదలుపెట్టాలని కోరారు. అలాగే రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని... నేషనల్ లా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు,కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో బుగ్గన భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రిని బుగ్గన కోరారు.
కాగా,టీటీడీకి జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా కేంద్రాన్ని కోరుతోంది. గతంలో ఈ అంశాన్ని ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. జీఎస్టీ అమలుకు ముందు టీటీడీకి రాష్ట్ర ప్రభుత్వం పన్నుల నుంచి మినహాయింపునిచ్చేది. జీఎస్టీ అమలులోకి వచ్చాక ఏటా రూ.120 కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి వస్తోంది. తిరుమల ప్రసాదంలో ఉపయోగించే దినుసులు,తిరుమలలోని కాటేజీలకు చెల్లించే అద్దెలపై కూడా జీఎస్టీ వసూళ్లు చేయడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కేంద్రం పెడ చెవిన పెడుతూనే ఉంది. కనీసం ఇప్పుడైనా టీటీడీని జీఎస్టీ నుంచి మినహాయిస్తుందో లేదో చూడాలి.
GST exemption for all services rendered by the Tirumala Tirupati Devasthanams and expeditious renewal of its FCRA application to enable NRI pilgrims to donate were the top pointers for discussion with the Hon’ble FM @NSitharaman today. Hon’ble FM positively responded. pic.twitter.com/YeNiUGo3uN
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 24, 2021