సెంట్రల్ విస్టాకూ అమరావతికి పోలికా ? చంద్రబాబు కామెంట్స్తో ఆడుకుంటున్న సాయిరెడ్డి
ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు శంఖుస్దాపన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ప్రాజెక్టును ప్రశంసిస్తూ నిన్న ఓ ప్రకటన చేశారు. ఇందులో ఆయన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు వంటిదే అమరావతి రాజధాని కూడా. అన్నీ ఒకే చోట ఉండేలా నిర్మించాలనుకున్నా, కానీ కుదరలేదు. అమరావతి గమ్యాన్ని తానే వెతుక్కుంటుందంటూ వేదాంత ధోరణిలో వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్పై ఇవాళ స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
కుంభకోణాల పుట్ట అమరావతిలో బాబు నిర్మించిన తాత్కాలిక సచివాలయానికి వెయ్యి కోట్లకు పైగా ఖర్చయిందట. టెంపరరీ అంటూనే చదరపు అడుగుకు రూ.3500 దోచిపెట్టాడు. నూతన పార్లమెంటు భవనానికి కేంద్రం కేటాయించింది రూ.971 కోట్లే. అడ్డగోలుగా స్కాంలకు పాల్పడి నిప్పు, తుప్పు అనడం బాబుకే చెల్లిందంటూ విజయసాయిరెడ్డి తన ట్వీట్లో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తద్వారా అమరావతికీ, సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు పోలికా అన్నట్లుగా సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. దీంతో సాయిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
పార్లమెంటు కొత్త భవనం సెంట్రల్ విస్తా ప్రాజెక్టును రూ.971 కోట్లతో నిర్మించేలా కే్ంద్రం టాటా కన్స్ట్రక్షన్స్కు కాంట్రాక్టు అప్పగించింది. కానీ గతంలో అమరావతిలో తాత్కాలిక సచివాలయం కోసం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం షాపూర్జీ పల్లోంజీ గ్రూపుకు రూ.800 కోట్ల రూపాయలు చెల్లించిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇది తాత్కాలిక సచివాలయం అయినప్పటికీ ఇంత భారీ ఖర్చుపెట్టడంపై వైసీపీ ఎంపీ సాయిరెడ్డి తన ట్వీట్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాస్తవానికి చంద్రబాబు సెంట్రల్ విస్టా ప్రాజెక్టును పోల్చింది అమరావతిలో నిర్మించ తలపెట్టిన శాశ్వత భవనాల సముదాయంతో కావడం ఇక్కడ విశేషం.