దుబ్బాకలో అభ్యర్ధే దొరకలేదు- బీజేపీ గెలిస్తే సంబరాలా ? టీడీపీ తీరుపై సాయిరెడ్డి సెటైర్లు...
తెలంగాణలోని దుబ్బాకలో తాజాగా జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి రఘనందన్ రావు గెలుపు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార టీఆర్ఎస్ను మట్టి కరిపించిన రఘునందన్రావుపై బీజేపీ ఏపీ నేతలు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇదే అదనుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కూడా దుబ్బాకలో బీజేపీ అభ్యర్ధి గెలుపును ప్రశంసించారు. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రంగంలో దిగారు.
Recommended Video
జాతీయ పార్టీగా చెప్పుకునే టీడీపీకి దుబ్బాకలో అభ్యర్ధే దొరకలేదని, అలాంటిది బీజేపీ అభ్యర్ధి గెలుపుకు చంద్రబాబు, లోకేష్ సంబరాలు చేసుకోవడమేంటని వైసీపీ ఎంపీ సాయిరెడ్డి ట్విట్టర్లో ప్రశ్నించారు. చంద్రబాబు జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా, లోకేష్ కార్యదర్శిగా చెప్పుకుంటున్నా దుబ్బాకలో టీడీపీకి అభ్యర్దే దొరకలేదని సాయిరెడ్డి ఆక్షేపించారు.
అక్కడ బీజేపీ గెలిస్తే మాత్రం సొంత పార్టీ గెలిచినట్లు మురిసిపోతున్నారని సాయిరెడ్డి విమర్శించారు. ఇంకొకరి గెలుపు ఇలా పండుగ చేసుకోవడం దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. వింతల్లో కెల్లా వింత ఇది అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.
టీడీపీ దుబ్బాక ఉప ఎన్నికకు ముందే తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కమిటీలు ప్రకటించింది. అయినా దుబ్బాకలో పోటీకి మాత్రం అభ్యర్ధి దొరకలేదు. దీంతో టీడీపీ శ్రేణులు మౌనంగా ఉండిపోయాయి. ఆ తర్వాత అక్కడ బీజేపీ గెలవడంతో విజేత రఘునందన్రావుకు టీడీపీ నేతలు అభినందనలు చెబుతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన టీడీపీ.. దుబ్బాక ఉపఎన్నికలో అభ్యర్ధి దొరకని పరిస్ధితికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే క్రమంలో సాయిరెడ్డి ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.