అధికారుల పట్ల సీఎం తీరుపై వైసీపీ సెటైర్లు ! కోడలిని వేధించే అత్తలా తయారైన చంద్రబాబు !
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి మరోమారు తన విమర్శల తీవ్రతను పెంచారు. ఫొని తుఫాన్ నేపథ్యంలో- చోటు చేసుకున్న పరిణామాలను కేంద్ర బిందువుగా చేసుకుని ఆయన చంద్రబాబుపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. చంద్రబాబు లేకపోవడం వల్లే అధికారులు స్వేచ్ఛగా పనిచేయగలిగారని, సకాలంలో బాధితులకు అవసరమైన సహాయ, పునరావాస చర్యలను పూర్తి చేయగలిగారని చెప్పారు.
తిత్లీ నిధులు ఏమయ్యాయి?
గత ఏడాది సంభవించిన తిత్లీ తుఫాన్ పెను నష్టాన్ని మిగిల్చిందని, దీనికి సంబంధించిన మరమ్మతు పనులు ఇంకా మిగిలే ఉన్నాయని విజయసాయి రెడ్డి అన్నారు. తిత్లీ తుఫాను వల్ల 3,673 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు అప్పట్లో చంద్రబాబు కేంద్రానికి నివేదిక సమర్పించారని గుర్తు చేశారు. కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో, వాటినేం చేశారో ఎవరికీ తెలియదని, దాని గురించి ప్రశ్నించిన పాపానికి ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారని సాయిరెడ్డి ఆరోపించారు. కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో, ఇచ్చిన నిధులను చంద్రబాబు ఏం చేశారో ఎవరికీ తెలియదని అన్నారు. పారదర్శకంగా పరిపాలిస్తానంటూ గప్పాలు కొట్టే చంద్రబాబు దీనికి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిత్లీ తుఫాన్ మిగిల్చిన నష్టానికి సంబంధించిన పనులు ఇంకా మిగిలే ఉన్నాయని అన్నారు.
శ్రీవారి భక్తులకు శుభవార్త! అక్షయ తృతీయ డాలర్లు సిద్ధం!
సూపర్ సైక్లోన్ ఫొని నష్టం వంద కోట్లు కూడా లేదు..
సూపర్ సైక్లోన్గా గుర్తింపు తెచ్చుకున్న ఫొని వల్ల రాష్ట్రంలో 100 కోట్ల రూపాయల మేర కూడా నష్టాన్ని కలిగించలేదని సాయిరెడ్డి చెప్పారు. తిత్లీ వల్ల కలిగిన నష్టాన్ని వేల కోట్ల రూపాయల మేర అధికంగా చూపించి, కేంద్రం నుంచి ఆ నిధులను రాబట్టుకుని దిగమింగేశారని ఆరోపించారు. చంద్రబాబు మాయా విన్యాసాలు బట్టబయలు అయ్యాయని విమర్శించారు. తుఫాన్ సహాయం కోసం కేంద్రం విడుదల చేసిన వందల కోట్ల రూపాయలను చంద్రబాబు దోచుకున్నారని, వాటిని తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు.
అధికారులను క్రెడిట్ను హైజాక్ చేస్తోన్న చంద్రబాబు..
ఫొని తుఫాన్ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు రేయింబవళ్లు కష్టపడి ముందు జాగ్రత్తలు తీసుకున్నారని విజయసాయి రెడ్డి ప్రశంసించారు. వారికి దక్కాల్సిన ఘనతను ఆయన హైజాక్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కోడలిని వేధించే అత్తలాగా.. తనకు అధికారం లేకపోయినా అధికారులను వేధిస్తున్నారని చురకలు అంటించారు. తుఫాన్లు సంభవించినప్పుడల్లా కరెంట్ స్థంభాలు కూలకున్నా, జనరేటర్లు, క్రేన్లు అద్దెల పేరుతో ట్రాన్స్కో అధికారులు దొంగ బిల్లులను సృష్టించి కోట్ల దోచుకున్నారని, దీనిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. దీని వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని ఆరోపించారు.
గతంలో ఒడిశాకు వేల సంఖ్యలో కరెంట్ స్థంభాలు పంపినట్టు కూడా దొంగ లెక్కలు చూపించారని, ఈ దొంగల ముఠా నాయకుడు చంద్రబాబేనని ధ్వజమెత్తారు. ఇసుక, మట్టి, భూములు, ఖనిజాలు కొల్లగొట్టి చివరకు కృష్ణానదిని పూడ్చి వంద ఎకరాల ద్వీపాన్ని తయారు చేయించడానికి చంద్రబాబు ప్రయత్నించారని, ఆలస్యంగానైనా రెవెన్యూ అధికారులు స్పందించి డ్రెడ్జర్, ఇతర యంత్ర పరికరాలను స్వాధీనం చేసుకున్నారని అన్నారు.