మంగళగిరి ప్రజలు పొర్లించి కొట్టినా బుద్ధి రాలేదా..మాలోకం! సాయిరెడ్డి ఫైర్
Recommended Video
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి మరోసారి చెలరేగిపోయారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ ను టార్గెట్ గా చేసుకుని, తనదైన శైలిలో విమర్శలు చేశారు. నారా లోకేష్ ను మాలోకం అని సంబోధిస్తూ కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంపై వైఖరిని తప్పుపడుతూ నారా లోకేష్ ఇటీవలి కాలంలో తరచూ ట్వీట్లు సంధిస్తోన్న విషయం తెలిసిందే. ఆ ట్వీట్లను ట్వీట్లతోనే ఎదుర్కొంటున్నారు విజయసాయి రెడ్డి. ధీటుగా సమాధానం ఇస్తున్నారు. ట్వీట్లకు ట్వీట్లతోనే బదులిస్తున్నారు. గురువారం ఉదయం కూడా ఆయన నారా లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డారు. ఆయనతో పాటు జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావునూ వదల్లేదు.
టీటీడీ జేఈఓ ధర్మారెడ్డికి కొత్త తలనొప్పి: ఆయన పేరుతో దళారుల ధందా: పీఆర్వోలుగా చలామణి
పోలింగ్ సిరా చుక్క చెరిగిపోకముందే..
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి కనీసం మూడు నెలలు కూడా కాలేదని, అప్పుడే గుండెలు బాదుకునే బ్యాచ్ వీధుల్లోకి వచ్చిందని విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజల వేళ్లపై పోలింగు రోజు వేసిన సిరా మరక ఇంకా చెరిగిపోక ముందే- పథకాలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు ఏవీ అమలు కావట్లేదని అంటూ గుండెలు బాదుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రజలు నారా లోకేష్ ను పొర్లించి కొట్టినప్పటికీ.. ఆయనకు స్పృహ రాలేదని అన్నారు. ఈ సందర్భంగా సాయిరెడ్డి.. నారా లోకేష్ ను మాలోకంగా అభివర్ణించారు. ప్రజలు ఛీత్కరించినా మాలోకానికి స్పృహ రాలేదని చెప్పారు. హామీలను విస్మరించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను విమర్శిస్తూ అప్పుడే ఏడుపు లంకించుకున్నాడని మండిపడ్డారు.
అవినీతిని వ్యవస్థీకృతం చేసిన చంద్రబాబు..
అవినీతి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారని సాయిరెడ్డి అన్నారు. వైఎస్ జగన్ చేస్తోన్న కృషితో రాష్ట్రానికి సరికొత్త ఇమేజీ రానుందని అన్నారు. రాష్ట్రానికి పట్టిన అవినీతి మరకను తుడిచేసి, సరికొత్త ఇమేజీని తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం రాష్ట్రానికి పరిశ్రమలు రావని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదివరకు ఆదాయపు పన్ను శాఖ, ఎన్ ఫోర్స్ మెంట్ డైెరెక్టరేట్ అధికారుల దాడులు చోటు చేసుకున్నప్పుడు కూడా తెలుగుదేశం నాయకులు ఇలాగే మాట్లాడారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతిని వ్యవస్థీకృతం చేశారని విమర్శించారు. అవినీతి లేకుండా పనులెలా జరుగుతాయని చంద్రబాబు చెప్పడంలో వింతేమీ లేదని అన్నారు.
రివర్స్ టెండరింగ్ అంటే వెన్నులో వణుకెందుకు?
తెలుగుదేవం ప్రభుత్వ హయాంలో పోలవరం, పట్టిసీమ వంటి భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలపై ఆరా తీస్తున్నామని సాయిరెడ్డి అన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల పనులకు సంబంధించిన టెండర్ల వ్యవస్థపై రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందని అన్నారు. రివర్స్ టెండరింగ్ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పగానే మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు, చంద్రబాబు నాయుడికి వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు. పోలవరం నిర్మాణ పనుల సందర్భంగా వారు దోచుకున్న ప్రతి రూపాయి కక్కిస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా కులం, వర్గం అనే బలహీనతలు వైఎస్ జగన్ కు లేవని అన్నారు.