ఐటీ గ్రిడ్స్ అశోక్ కు ప్రాణహాని : చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటానికే ఆ ప్రయత్నాలు..!
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఏడున్నర కోట్ల మంది ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈఓ అశోక్ కు ప్రాణహాని ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఎక్కడ ఉన్నా, వెంటనే అజ్ఞాతం వీడాలని, పోలీసులకు లొంగిపోవాలని సూచించారు. డేటా చోరీ కేసులో ప్రధాన నిందితుడైన అశోక్ ను చంద్రబాబు ఏమైనా చేయవచ్చని అన్నారు. చంద్రబాబు నుంచి అశోక్ కు ప్రాణహాని ఉందని చెప్పారు. బుధవారం విజయసాయి రెడ్డి వరుసటా ట్వీట్లు సంధించారు. పలు అంశాలను ట్వీట్ల రూపంలో ప్రస్తావించారు.
హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రధాన కేంద్రంగా ఐటీ గ్రిడ్స్ సంస్థ కార్యకలాపాలను కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి చెందిన అధికారిక యాప్ సేవామిత్రను రూపొందించింది ఈ సంస్థే. ఆ సంస్థ సీఈఓ అశోక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆప్తుడంటూ వార్తలు వచ్చాయి. అశోక్ ను అడ్డుగా పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కేంద్రప్రభుత్వ సంస్థ యుఐడీఏఐ నుంచి సుమారు 7 కోట్ల 52 లక్షల మందికి పైగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారంటూ మాదాపూర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. ఐటీ గ్రిడ్స్ సంస్థ వద్ద లభించిన సమాచారం, తమ డేటా బేస్ లో ఉన్న సమాచారం సరిపోలాయని, ఆధార్ సంస్థ యుఐడీఏఐ తెలంగాణ ఫోరెన్సిక్ విభాగం అధికారులు నిర్ధారించాయి. ఆధార్ సంస్థ అధికారులు కూడా ఐటీ గ్రిడ్స్ పై కేసు పెట్టారు. దీనితో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
ఈ పరిస్థితుల్లో ఐటీ గ్రిడ్స్ అశోక్ కొంతకాల నుంచి కనిపించట్లేదు. డేటా చోరీ ఉదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే ఆయన హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చారు. అశోక్ తమ వద్దే ఉన్నారంటూ అప్పట్లో చంద్రబాబు కూడా ప్రకటించారు. అప్పటి నుంచి అశోక్ అజ్ఞాతంలో ఉంటున్నారు. ఆయనను అరెస్టు చేయడానికి తెలంగాణ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. అశోక్ కు ప్రాణహాని ఉందని, ఆయన వెంటనే అజ్ఞాతం వీడాలని అన్నారు. పెద్ద పెద్ద వాళ్లనే వాడుకుని పంపించిన చరిత్ర చంద్రబాబుకు ఉందని చెప్పారు. చంద్రబాబు నుంచి అశోక్ కు ప్రాణహాని ఉందని, ఆయన నోరు విప్పితే..తండ్రీ కొడుకులు ఇరుక్కుపోతారని చెప్పారు. ఈ విషయం తెలుసు కాబట్టే చంద్రబాబు, నారా లోకేష్ ఏమైనా చేస్తారని అన్నారు.
చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటానికి..
చంద్రబాబు ఇక మనవడితో ఆడుకోవాల్సిందేనని ఏపీ ప్రజలు తీర్పు ఇచ్చారని విజయసాయి రెడ్డి చెప్పారు. మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు అనంతరం తెలుగుదేశం ఓటమి ప్రకటన లాంఛన ప్రాయమేని అన్నారు. ఇందులో తిరుగు లేదని చెప్పారు. చంద్రబాబుకు ప్రజలు విశ్రాంతి ఇచ్చారని విజయసాయి రెడ్డి చెప్పారు. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడటం కోసం పచ్చ మీడియా ఆయన అఖండ విజయం సాధిస్తారని విశ్లేషణలు ఇస్తోందని ఎద్దేవా చేశారు. ఎవడి పిచ్చి వాడికి ఆనందం అనే సామెత వీరి కోసమే పుట్టినట్టు ఉందని చురకలు అంటించారు.
ఈవీఎంలపై ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదే?..
తొలిదశలో ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 20 రాష్ట్రాలు, 91 లోక్ సభ స్థానాలు, అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయని, ఏ ఒక్కరు కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలు లేవనెత్తలేదని విజయసాయి రెడ్డి అన్నారు. పోలింగ్ చోటు చేసుకున్న 20 రాష్ట్రాల్లో కూడా ఈవీఎంలలో చిన్నచిన్న సమస్యలు తలెత్తాయని, అయినప్పటికీ.. ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. బాబు మాత్రం దేశమంతా తిరుగుతూ బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరపాలని బట్టలు చింపుకొంటున్నారని అన్నారు. అయినప్పటికీ.. ఎవ్వరూ ఆయనను పట్టించుకోవట్లేదని చెప్పారు.
అప్పుడు లక్ష్మీ పార్వతి..ఇప్పుడు ఈసీ..
గతంలో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కోవడానికి చంద్రబాబు లక్ష్మీ పార్వతిని దుష్టశక్తి అంటూ బూచిగా చూపించారని, ఇప్పుడు ఓటింగ్ మిషన్లలో నిక్షిప్తమైన ఓటమి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈసీ అన్యాయం చేసిందని ఏడుపు లంకించుకున్నారని విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. పిల్లి శాపాలకు ఉట్లు తెగవని అన్నారు. అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి ఒక వీధి రౌడీలా పోలింగ్ బూత్ ఆక్రమణకు తెగబడటం దేశ చరిత్రలో ఎక్కడా చోటు చేసుకుని ఉండదని చెప్పారు. ఓటమి, నిస్పృహతో కోడెల శివప్రసాద్ రెచ్చి పోయారని విమర్శించారు.