చంద్రబాబు స్కెచ్..రీపోలింగ్లో లబ్ది పొందడానికే: విజయసాయి రెడ్డి
అమరావతి: ఎన్నికల సర్వేల పేరుతో రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రా ఆక్టోపస్గా గుర్తింపు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్సభ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కెచ్లో భాగంగానే లగడపాటి తెరమీదికి వచ్చారని వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి వీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని లగడపాటి పరోక్షంగా వెల్లడించిన విషయం తెలిసిందే.
నిజానికి- ఎన్నికల తుది విడత పోలింగ్ ముగిసిన రోజు సాయంత్రం ఆయన.. తాను చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఒకరోజు ముందే- లగడపాటి ప్రెస్మీట్ నిర్వహించడం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందంటూ పరోక్షంగా సూచించారు. దీని వెనుక ఉన్న అసలు కారణం- రీపోలింగ్ను ప్రభావితం చేయడమేనని సాయి రెడ్డి విమర్శించారు.
23వ తేదీన కౌంటింగ్ ప్రారంభం కాగానే.. చంద్రబాబు నాయుడు లగడపాటి వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను అడ్డుగా పెట్టుకుని మరోసారి రచ్చ చేస్తారని అన్నారు. తాము గెలుస్తామని లగడపాటి సర్వే వెల్లడించిందని, అయినప్పటికీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఈవీఎంల ట్యాంపరింగేనని చంద్రబాబు గోల చేస్తారని అన్నారు. ఆంధ్రా ఆక్టోపస్గా గుర్తింపు ఉన్న లగడపాటి రాష్ట్ర విభజన తరువాత క్రమంగా ఎల్లో జలగలా మారిపోయారని ఎద్దేవా చేశారు. ఆయన తన పేరును నారా రాజగోపాల్గా మార్చుకోవాలని సూచించారు.