జగన్ సర్కారు మరో రికార్డు.. చంద్రబాబును సొంత ఎమ్మెల్యేలే ఛీకొట్టారన్న వైసీపీ విజయసాయి..
''వైసీపీ ఓ బిస్కెట్ పార్టీ.. నేరచరిత్ర కలిగిన మోపిదేవి వెంకటరమరణను.. దేశవ్యాప్తంగా 10కిపైగా కేసులున్న అయోధ్య రామిరెడ్డిని.. అసలు ఏపీతో సంబంధమేలేని పరిమళ్ నత్వానీని ఎంపీలుగా పంపడం ద్వారా పెద్దల సభ పరువు తీశారు.. అయినాసరే నైతిక విజయం మాదే''అంటూ టీడీపీ చేసిన తీవ్ర ఆరోపణలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. అంతేకాదు, ఈ ఏడాది కాలంలో జగన్ సర్కారు సాధించిన అరుదైన రికార్డును సైతం ఆయన వెల్లడించారు.
తమిళనాడులో భారీగా వైఎస్ జగన్ పోస్టర్లు.. కొత్త రాజకీయ పార్టీకి ఆదర్శం.. ఆ హీరోనే సీఎం అంటూ..
ఆత్మవిమర్శ చేసుకోండి..
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని, క్రిమినల్స్ ను రాజ్యసభకు పంపుతున్నారని, ఓడిపోయినప్పటికీ రాజ్యసభ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనంటూ టీడీపీ నేతలు చేస్తోన్న ప్రకటనలు ప్రేలాపనల్లా ఉన్నాయని విజయసాయి మండిపడ్డారు. సభా మర్యాదకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేయొద్దని, ఇలా దిగజారి మాట్లాడే బదులు ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు.
సొంత ఎమ్మెల్యేలే..
టీడీపీకి అధికారికంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా... రెండ్రోజుల కిందట జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి వర్ల రామయ్యకు కేవలం 17 ఓట్లే దక్కడం చర్చనీయాంశమైంది. టీడీపీ ఎమ్మెల్యేల్లో అచ్చెన్నాయుడు జైలులో ఉండటం, అనగాని ప్రసాద్ అనారోగ్య కారణంగా ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. టీడీపీని వీడనప్పటికీ, అనధికారికంగా పార్టీకి దూరమైపోయిన వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాంలు విప్ ఆదేశాల మేరకు ఓటేసినా, అవి చెల్లుబాటు కాని విధంగా వ్యవహరించినట్లు వెల్లడైంది. అనూహ్యరీతిలో మరో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఓటు కూడా చెల్లుబాటు కాకపోవడం గమనార్హం. ఇలా సొంత ఎమ్మెల్యేలే పార్టీకి ఓటేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘చంద్రబాబూ.. మీ ఎమ్మెల్యేలే ఛీకొట్టి మీకు ఓటేయలేదని గ్రహించండి''అని విజయసాయి ఎద్దేవా చేశారు.
ఇరకాటంలో మోదీ.. జగన్, కేసీఆర్ బాసట.. రాత్రికిరాత్రే కీలక ప్రకటనలు.. చైనా హింస నేపథ్యంలో
పెన్షన్లలో దేశ రికార్డు..
ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి సీఎం జగన్ అని, ఆయన మాట తప్పడం కల్ల అని, ఎన్నికల హామీ మేరకు గడిచిన ఏడాది కాలంలో జగన్ సర్కారు మొత్తం 9.44 లక్షల మందికి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించిందని, ఇది దేశంలోనే ఒక రికార్డని వైసీపీ ఎంపీ పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించిన ఏ పనులైనా నిర్ధిష్ట కాలపరిమితిలో నెరవేర్చుతామని సీఎం జగన్ జూన్ 9న ప్రకటించగా.. దాని ఫలితంగా.. దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 96,568 మందికి కొత్తగా పెన్షన్లు జారీ అయ్యాయని ఎంపీ వివరించారు.
Recommended Video
అదే బాబు హయాంలో..
ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకోకపోగా, ఐదేళ్ల పాలనలో చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేశారని, అదే విషయం కాగ్ రిపోర్టుల్లో సైతం బయటపడిందని వైసీపీ నేత అన్నారు. ఉద్యోగుల కష్టార్జితానికి చంద్రబాబు మేశారని కాగ్ రిపోర్టు తేల్చిందని, రూ.731 కోట్ల సీపీఎస్ డబ్బును బ్యాంకుకు జమ చేయకుండా పక్కదారి పట్టించిన వైనం, ఉద్యోగుల జీతాల నుంచి పది శాతం కొట్టేసిన వైనం వెలుగులోకి వచ్చాయని, ప్రత్యేక విమానాలకు, దొంగ దీక్షలకు చంద్రబాబు ప్రజాధనాన్ని దుబారా చేశారని విజయసాయి మండిపడ్డారు.