నిమ్మగడ్డ తప్పించుకోలేరు.. క్రిమినల్ కేసులో అరెస్టు తప్పదు.. వైసీపీ ఉచ్చు.. సూసైడ్ స్క్వాడ్ అంటూ..
ఒక ఐడియా జీవితాన్నే మార్చేసినట్లు.. ఒక లేఖ.. ఏపీ రాజకీయాల దిశను మార్చబోతున్నది. సదరు లేఖ ఫేకా లేక ఒరిజినలా అని క్రిస్టల్ క్లియర్ గా తేలకున్నా.. రాసింది తాను కాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లీకులిచ్చినా... లేఖ అందింది కాబట్టి చర్యలకు ఆదేశించామని కేంద్రం క్లారిటీ ఇచ్చినా.. ఇప్పటికీ ఆ లేఖపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ వివాదానికి ఎండ్ కార్డ్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని, తప్పదనుకుంటే నిమ్మగడ్డపైనా క్రిమినల్ కేసు పెట్టి, అరెస్టు చేసేందుకు వెనుకాడబోమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బాంబు పేల్చారు.
ఏముందా లేఖలో?
ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ రాసినట్లుగా ప్రచారంలో ఉన్న లేఖలో సీఎం జగన్, వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయి ఆరోపణలున్నాయి. సీఎం దగ్గర్నుంచి అధికార పార్టీ నేతల బెదిరింపుల వల్ల ఏపీలో తనకు రక్షణ లేకుండా పోయిందని, చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో దాడులు, బలవంతపు ఏకగ్రీవాలు చోటుచేసుకున్నాయని, ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచుతూ పట్టుబడితే సభ్యత్వం రద్దు చేస్తామన్న చట్టం కూడా దారుణంగా ఉందని, మొత్తంగా ఏపీలో ఎన్నికల నిర్వహణకు వాతావరణం అనుకూలంగా లేనందున కేంద్రమే బలగాలను మోహరింపజేసి ప్రక్రియ చేపట్టాలని లేఖలో రాసుకొచ్చారు.
నిమ్మగడ్డనైనా అరెస్టు చేస్తాం..
ఎస్ఈసీ నిమ్మగడ్డ పేరు మీద విడుదలైన లేఖను నిజంగా ఆయనే రాసినా.. లేదా ఇతరులెవరైనా సృష్టించినా.. ఎవ్వర్నీ వదిలిపెట్టబోమని, క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఈ మేరకు ట్విటర్ లో స్పందించిన ఆయన.. లేఖలో పేర్కొన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని, అవి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడంతోపాటు ఆల్రెడీ జారీ అయిన ఆర్డినెన్స్ ను తప్పుపట్టేలా ఉన్నాయన్నారు. అంతటి వివాదాస్పద లేఖ రాసింది నిమ్మగడ్డే అయినా, రాయించింది చంద్రబాబైనా చట్టం నుంచి తప్పించుకునే చాన్సే లేదని, క్రిమినల్ కేసులో అరెస్టుకాక తప్పదని ఆయన హెచ్చరించారు.
చివరికి జరిగేదిదే..
తన మనుగడ కోసం కులం కార్డును, ప్రాంతీయతను వాడుకోవడం చంద్రబాబుకు అలవాటైన పనే అని, బాబును నమ్మి, ఆయన చెప్పినటల్లా చేసినవాళ్లు చివరికి సస్పెన్షన్లు కేసులు ఎదుర్కుంటున్నారని ఎంపీ గుర్తుచేశారు. అయినాసరే, చంద్రబాబునే కులదైవంగా కొలుస్తూ ఆయన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడేవాళ్లు సూసైడ్ స్క్వాడ్ తో సమానమని నిమ్మగడ్డను ఉద్దేశించి విమర్శించారు. బాబు అండ్ కో ఆటలు కొద్ది రోజులు సాగినా.. చివరికి చట్టం ముందు తలొంచాల్సిందేనని, అదే జరిగి తీరుతుందని విజయసాయి ఘంటాపథంగా చెప్పారు.
అందుకే ఈ నాటకం..
కేంద్రానికి ఎస్ఈసీ లేఖగానీ, అంతకుముందు జరిగిన పరిణామాలకుగానీ స్పష్టమైన కారణాలున్నాయని, మద్యం, డబ్బుల పంపకం లేకుండా ఎన్నికలు పెడితే తాను సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతానన్న ఆందోళనలోనే చంద్రబాబు ఇన్ని కుట్రలు పన్నారని విజయసాయి ఆరోపించారు. ‘‘స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఆశచూపిన డబ్బును తీసుకోడానికి ఓటర్లు నిరాకరించారు. దీంతో బాబుకు భయం పట్టుకుంది. డబ్బులు, మద్యం లేకుండా టీడీపీ గెలవడం కష్టమని తెలుసు కాబట్టే ఆ చట్టంపై తీవ్ర విమర్శలు చేస్తూ డ్రామాలు మొదలుపెట్టారు. ఆ డ్రామాలో కీలక ఘట్టంగా నిమ్మగడ్డ తో ఎన్నికల్ని వాయిదా వేయించారు''అని వైసీపీ ఎంపీ మండిపడ్డారు.
హైదరాబాద్లోనే ఆయన మకాం..
కేంద్ర సర్కారుకు ఐదు పేజీల ఫిర్యాదు లేఖ అనంతరం దాంతో తనకే సంబంధం లేదంటూ సెక్రటరీ ద్వారా చెప్పించిన ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని, అక్కడే మకాం వేశారు. ఆయన సెక్యూరిటీ బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనతో మొదలైన రాజకీయ మలుపులు వయా మండలి రద్దు మీదుగా ఇప్పుడు ఎన్నికల కమిషనర్ ను అరెస్టు చేస్తామనేదాకా ఊహించని పరిణామాలెన్నో చోటుచేసుకుంటున్నాయి.