మత్తు డాక్టర్ నుంచి నిమ్మగడ్డ దాకా.. చంద్రబాబు వాడకంలో బలి, బాబుకు అది ఈజీ అన్న సాయిరెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై విరుచుకు పడుతూనే ఉన్నారు. ప్రజల్లో చంద్రబాబు విశ్వసనీయత కోల్పోయారని, అందుకే కుట్రలపై కాన్సంట్రేట్ చేస్తున్నారంటూ తాజా పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవినీతి ఇప్పటివరకు ఒకటి కూడా బయటకు రాకుండా కాపాడుకున్నాడు అంటే ఎల్లో నెట్వర్క్ ఎంత గట్టిదో అర్థం చేసుకోవాలంటూ పలు అంశాలను ప్రస్తావించారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.
ఇలా ఎంతకాలం నెట్టుకొస్తావ్ పార్టీని చంద్రం ; టీడీపీ పరువు తీసేస్తూ సాయిరెడ్డి మైండ్ గేమ్
ఆ డబ్బు ఎక్కడిదో ఇప్పటికీ పట్టుకోలేకపోయారు.. ఎల్లో నెట్వర్క్ గట్టిది
సీఎంగా ఉన్నప్పుడు తన పీఎస్ ఇంట్లో ఇన్కమ్ టాక్స్ అధికారులు గుర్తించిన రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు, స్టీఫెన్ సన్ కు పంపిన 50 లక్షలు ఎక్కడివో ఇన్నేళ్లయినా పట్టుకోలేకపోయారు అంటే ఎల్లో నెట్వర్క్ ఎంత గట్టిదో తెలియడం లేదూ అంటూ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి హవాలా అంటే శవాల మీద పేలాలు ఏరుకున్నంత ఈజీ బాబుకు అంటూ చంద్రబాబును అవినీతిలో ఆరితేరిన వాడిగా అభివర్ణించారు.
కంకర కనిపెట్టిన మీరు పేదల ఇళ్ళ కంకర అడ్డుకోవటం ఏందయ్యా ?
కృష్ణాజిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న మైనింగ్ వ్యవహారం, దేవినేని ఉమా పై జరిగిన దాడి, ఆపై నమోదైన కేసుల వ్యవహారంలో స్పందించిన విజయసాయిరెడ్డి సైరా పంచ్ వేశారు. కేవలం పేదల ఇళ్ళు కట్టడానికి కావలసిన కంకరను అడ్డుకుని పేదల ఇల్లు పూర్తి కాకుండా చేయాలన్న కుట్రతోనే దేవినేని ఉమ అక్కడకు వెళ్లారని అర్థం వచ్చేలా కంకర రాళ్లు కనిపెట్టిన మీరు పేదల ఇళ్ళ కంకర రాకుండా అడ్డుకోవడం ఏంటయ్యా అంటూ చంద్రబాబుని చూస్తూ మహిళలు ఏడుస్తున్న ఒక ఫోటోను పెట్టి ఎద్దేవా చేశారు.
విశ్వసనీయత పాతాళంలోకి జారిపోయాక బాబు చేస్తుందిదే
అన్నీ తానే చేశానని చెప్పే బాబు కంకరను కూడా తానే కనిపెట్టాడని చెప్తారని సైరా పంచ్ వేసి దేవినేని ఉమా పై జరిగిన దాడి వ్యవహారం, పేదల ఇళ్ల నిర్మించటానికి తరలిస్తున్న కంకరను అడ్డుకునే కుట్రగా అభివర్ణించారు. అంతేకాదు చంద్రబాబుపై విశ్వసనీయత పాతాళంలోకి జారిపోయిందంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి విశ్వసనీయత పాతాళంలోకి జారిపోయాక ఇక ప్రజల దగ్గర తన పప్పులు ఉడకవు అని డిసైడ్ అయిపోయాడు బాబు అంటూ సంచలన పోస్ట్ చేశారు. అందుకే రోజుకో వ్యవహారంతో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్రలపై కాన్సన్ట్రేషన్ పెంచారని వ్యాఖ్యానించారు.
ఆయన వాడకం మామూలుగా ఉండదు .. మత్తు డాక్టర్ నుండి నిమ్మగడ్డ దాకా
ఇక చంద్రబాబు వాడకంలో మత్తు డాక్టర్ సుధాకర్ నుంచి నిమ్మగడ్డ దాకా ఎంతో మంది బలి అవుతూనే ఉన్నారు అంటూ సాయి రెడ్డి చంద్రబాబు వాడకంపై పోస్ట్ చేశారు. నిండా మునిగిన వాడికి చలి ఏముంటుంది అంటూ సెటైర్ వేశారు.ఇదే సమయంలో అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి మాన్సాస్ ట్రస్టులో ఆడిట్ జరగొద్దు.. ట్రస్ట్ బోర్డు ఉండొద్దు అంటూ పిటిషన్ వేశావ్ అంటే నువ్వు ఎంత పారదర్శకంగా పని చేస్తున్నారో అర్థమవుతుంది అశోకు అంటూ అశోక్ గజపతిరాజును టార్గెట్ చేశారు.
ఆడిటింగ్ అంటే ఉలుకెందుకు అశోక్ ? సాయిరెడ్డి ధ్వజం
అక్రమాలకు పాల్పడకపోతే ఆడిటింగ్ అంటే ఉలుకెందుకు అశోక్ ? అని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అన్నారు. వారికి జవాబుదారీగా ఉండాలని హితవు పలికారు . అంతా నా ఇష్టం అనడానికిది రాజరికం కాదు రాజా అంటూ విజయసాయి రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీని ఎదుర్కోవడానికి చాలామంది నేతలు విమర్శలు చేస్తున్నా, వైసీపీ నుంచి మాత్రం విజయసాయిరెడ్డి ఒక్కడు చాలు అన్నట్టు నిత్యం చంద్రబాబు నాయుడితో పాటు టిడిపి నేతలతో చెడుగుడు ఆడుతున్నారు. మాటలతోనే టిడిపిని బలహీనం చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.