ఏపీలో కరోనా: వాళ్లకు భయానక భ్రమలు..మోదీతో జగన్ చెప్పింది విన్లేదా?80,896 మందికి ప్రైమరీ కాంటాక్ట్స్
''ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్నా జగన్ ప్రభుత్వం నిజాలు చెప్పడంలేదు. కొవిడ్-19 కేసుల్ని, మరణాల్ని దాచిపెడుతున్నారు. అది పెనుప్రమాదానికి దారితీస్తుంది. రాష్ట్రంలో వైరాలజీ ల్యాబ్ ల సంఖ్య పెంచి, ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరిస్తే మహమ్మారిని తరిమేయొచ్చు. లాక్ డౌన్ వేళ ప్రతి పేద కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలి..''అంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు రాసిన లేఖపై అధికార వైసీపీ తీవ్రస్థాయిలో మండిపడింది. సామాజిక దూరం పేరులో హైదరాబాద్ పారిపోయినోళ్లు కూడా సలహాలివ్వడం ఏపీ ఖర్మ అని ఎద్దేవా చేసింది.
ఏపీకి చెందిన మర్కజ్ కార్యకర్తల విషయంలో ముందే హెచ్చరించినా జగన్ సర్కారు పట్టించుకోలేదంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఓ వైపు.. కరోనా కేసులు, మరణాలు, నివారణ చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోవైపు.. సీఎం జగన్ పై దాడికి దిగారు. దీంతో వైసీపీ ట్రంబుల్ షూటర్, ఎంపీ విజయజాయి రెడ్డి రంగంలోకిదిగి ప్రతిపక్ష పార్టీలపై ఎదురుదాడి కొనసాగించారు. బాబు, ఆయన అనుకూల మీడియా, పవన్ లపై ఎంపీ నిప్పులు చెరిగారు.
కరోనా వస్తుందని ముందే తెలుసా?
‘‘ఐదేళ్లలో అత్యవసర వైద్య సదుపాయాలను గాలికోవదిలేశాడు.. ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు, కొత్త ఐసీయూ వార్డుల్ని ఏర్పాటు చేయలేదు. అందుకు రూపాయి కూడా ఖర్చుపెట్టని చంద్రబాబు.. ఇవాళ వైరస్ నివారణ ఉపాయాలు చెబుతున్నాడు. కరోనా వస్తుందని తనకు ముందే తెలుసని కాకమ్మకథలు చెబుతున్నాడు. అత్యవసర సమయంలో ప్రజల్ని ఆస్పత్రులకు చేర్చే 108, గ్రామాల్లో వైద్యసేవలందించే 104 అంబులెన్స్ లను మూలన పడేయడం ద్వారా చంద్రబాబే ప్రజల్ని ప్రమాదంలోకి నెట్టాడు.
శాడిస్టిక్ భ్రమలు..
రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు పెరగాలని ఎవరైనా అనుకుంటారా? మనిషి జన్మెత్తిన ఏ ఒక్కరూ అలా కోరుకోరు. కానీ చంద్రబాబు, ప్యాకేజీ జీవి పవన్ కల్యాణ్, ఎల్లో మీడియాకు ఇలాంటి భయానక శాడిస్టిక్ భ్రమలున్నాయి. వైరస్ నియంత్రణలో సీఎం జగన్ ఫెయిలయ్యారని నిందించడానికే వీళ్లంతా కాచుకుని కూర్చున్నారు. శవ రాజకీయాలు చేయొద్దని చోడవరంలో చనిపోయిన వృద్ధురాలి బంధువులు గడ్డి పెట్టినా వీళ్లకు సిగ్గు తెచ్చుకోవట్లేదు''అని ఎంపీ విమర్శించారు.
3 అడుగులు.. 300 కి.మీ
ఆపత్కాలంలో ప్రజల్ని వదిలేసి పారిపోవడం చంద్రబాబు సహజ నైజమని, ఆమధ్య కృష్ణానదికి వరదొస్తే కరకట్ట మీదున్న తన కొంప మునుగుతుందేమోనని రాత్రికి రాత్రే హైదరాబాద్ పారిపోయాడని, మళ్లీ ఇప్పుడు కరోనా వైరస్ ప్రబలుతుందనగానే.. సూట్ కేసులు సర్దుకుని ముందే పొరుగు రాష్ట్రం చేరాడని విజయసాయి మండిపడ్డారు. సామాజిక దూరం 3 అడుగులు పాటించమంటే.. బాబు మాత్రం ఏకంగా 300 కిలోమీటర్లు పారిపోయాడని, అలాంటి వ్యక్తి తీరికగా కూర్చొని సుద్దులు చెప్పడం ఏపీ ఖర్మ కాక మరేంటని ఎంపీ వాపోయారు.
సీఎం చెప్పింది విన్నాకైనా..
ఏపీలో కరోనా నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్ కూలంకుషంగా వివరించారని, గురువారం నాటి వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడింది విన్న తర్వాత కూడా రాష్ట్ర సన్నద్ధత గురించి చంద్రబాబుకు ఇంకా ఏమైనా అనుమానాలున్నాయా? అని విజయసాయి నిలదీశారు. ఇప్పటికైనా చంద్రబాబు సొల్లు మాటలు కట్టిపెట్టాలని హితవుపలికారు. ఈ మేరకు ఎంపీ శుక్రవారం వరుస ట్వీట్లలో విమర్శలు సంధించారు.
ఇంతకీ సీఎం ఏం చెప్పారు?
కోవిడ్-19 నియంత్రణ చర్యలపై వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ గురువారం నిర్వహించిన కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. కరోనాపై సమగ్ర వ్యూహంతో ముందుకెళుతున్నామని, అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ వాడుకుంటున్నామని, అదే సమయంలో లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలు, రైతుల్ని ఆదుకునే కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. రాష్ట్రం నలుమూలల్లోని పెద్ద ఆస్పత్రుల్లో కొత్త ఐసీయూ వార్డులు, క్వారంటైన్ కు విడిగా ఏర్పాట్లు చేశామన్నారు. పాజిటివ్ పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తూనే, మొత్తంగా 80,896 మందిని ప్రైమరీ కాంటాక్ట్స్ గా గుర్తించి, వాళ్లందరినీ పూర్తి పర్యవేక్షణలో ఉంచామని వివరించారు.
Recommended Video
ఏపీలో ఇవాళ్టి సీన్ ఇది..
శుక్రవారం మధ్యాహ్నం నాటికి ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 161కి పెరిగింది. రాష్ట్రంలో తొలి మరణం కూడా ఇవాళే నమోదైంది. విజయవాడకు చెందిన 55 ఏళ్ల పాజిటివ్ పేషెంట్ చనిపోయారని, మార్చి 17న ఢిల్లీ నుంచి వచ్చిన కొడుకు ద్వారా అతనికి వైరస్ సోకిందని, ఆ కొడుకుతోపాటు మొత్తం 29 మందినీ ఐసోలేషన్ కు తరలించామని అధికారులు వెల్లడించారు.