తెగులుదేశం జాతీయ అధ్యక్షుడిని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వొచ్చా? విజయసాయి రెడ్డి
అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సందర్భం వచ్చిన ప్రతీసారీ చంద్రబాబు, ఆయన కుమారుడు మాజీమంత్రి నారా లోకేష్పై సోషల్ మీడియా ద్వారా విమర్శనాస్త్రాలను సంధించే సాయిరెడ్డి.. ఈ సారి రాష్ట్రావతరణ దినోత్సవాన్ని కేంద్రబిందువుగా చేసుకున్నారు. చంద్రబాబుపై ఎప్పట్లాగే విరుచుకుని పడ్డారు. చురకలు అంటించారు.
దీనికి కారణం- రాష్ట్రావతరణ దినోత్సవం నాడు చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు చెప్పకపోవడమే. నవంబర్ 1వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఏపీ ప్రజలకు శుభాకాంక్షు తెలిపారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజుజు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలను తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హోం మంత్రి సుచరిత.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు చెప్పకపోవడాన్ని విజయసాయి రెడ్డి తప్పుపట్టారు. జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా చెప్పుకొంటోన్న చంద్రబాబుకు రాష్ట్రావతరణ దినోత్సవం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అడుగు పెట్టే హక్కు చంద్రబాబుకు లేదంటూ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని తెగులుదేశంగా ఎద్దేవా చేశారు.
ఈ తెగులుదేశం జాతీయ అధ్యక్షుడిని మన రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వొచ్చా? అని విజయసాయి రెడ్డి అడిగారు. 4వ నెల, 20వ తేదీన పుట్టిన 420గా చంద్రబాబును అభివర్ణించారు. 11వ నెల 1వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవం వైభవంగా సాగుతోంటే.. చంద్రబాబుకు కనీసం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు కూడా చెప్పాలనిపించట్లేదని విమర్శించారు. చంద్రబాబును రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వకూడదని ఆయన ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో అడుగు పెట్టే అర్హతను కోల్పోయారని ధ్వజమెత్తారు.