ఏపీలో ఏడాది కిందటే కరోనా వైరస్.. వచ్చుంటే బాగుండనే క్రూరత్వం చంద్రబాబుది: వైసీపీ ఫైర్
సంఘటన ఎలాంటిదైనా.. సందర్భాలు ఏవైనా.. శవాలపై పేలాలు ఏరుకోవడమే చంద్రబాబు నైజమని, ఆయన దాన్ని ఎప్పటికీ వదిపెట్టబోడని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఏపీలో ఏడాది కిందటే కరోనా వైరస్ వచ్చుంటే బాగుండేదనే క్రూరత్వం బాబులో, ఆయనను సమర్థిస్తున్న ఎల్లో మీడియాలో కనిపిస్తున్నదని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తద్వారా ఏడాది కిందట ఇదే సమయానికి ఏపీ ఎన్నికలకు సమాయత్తమయిన సందర్భాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. హైదరాబాద్లో ఉంటూ చంద్రబాబు ఏపీపై కుట్రలు చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు.
ఆయనకదే ఇష్టం..
టీడీపీ చీఫ్ చంద్రబాబు తన రాజకీయ మనుగడ కోసం ప్రజల్ని బలిపెట్టేరకమని, జనం నిత్యం ఏదో ఒక ఉపద్రవంలో చిక్కుకుని కొట్టుమిట్టాడాలనేదే ఆయన సహజ స్వభావమని విజయసాయి చెప్పారు. ఏపీలో కరోనా తీవ్రతపై చంద్రబాబు అండ్ కో అనవసర రాద్ధాంతం చేస్తున్నదని మండిపడ్డారు. ఆదివారం ఈ మేరకు వరుస ట్వీట్లతో ఆయన ఫైరయ్యారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో సీఎం జగన్ ఫెయిలయ్యారని, ఇప్పటికైనా టీడీపీ సూచనల్ని ఫాలో కావాలని చంద్రబాబు పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇల్లిల్లూ జల్లెడ పట్టి..
విస్తీర్ణం పరంగా ఎనిమిదో పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జనాభా పరంగా 10 స్థానంలో ఉంది. ప్రస్తుతానికి ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19గా ఉంది. దేశంలోని ఇతర పెద్ద రాష్ట్రాలతో పోల్చుకుంటే కరోనా వ్యాప్తి ఏపీలో తక్కువగా ఉందని వైసీపీ ఎంపీ చెప్పారు. అయితే, అతి తక్కువ కరోనా పీడితులతో ఏపీ ప్రజలు నిర్భయంగా ఉండటాన్ని టీడీపీ, దాన్ని సమర్థించే కిరాయి మేధావులు సహించలేకపోతున్నారని, వైసీపీ సర్కారు.. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి జాగ్రత్తలు తీసుకున్నవైనాన్ని పచ్చనేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విజయసాయి విమర్శించారు.
హైదరాబాద్లో బాబు కుట్రలు..
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటనకు ముందే టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్ సహా కుటుంబమంతా అమరావతి నుంచి హైదరాబాద్ కు వచ్చేసిన సంగతి తెలిసిందే. కాగా, హైదరాబాద్ లో ఉంటూ కూడా బాబు ఏపీపై కుట్రలు పన్నుతున్నారని విజయసాయి ఆరోపించారు. ఇటీవల హైదరాబాద్ లోని హాస్టళ్లలో ఉంటోన్న విద్యార్థులు హుటాహుటిన ఏపీకి వెళ్లడం.. రాష్ట్ర సరిహద్దుల్లో వాళ్లను పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. దీనిపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం స్పందించారు. ఏపీ విద్యార్థులు హైదరాబాద్ లోనే ఉండాలని, వాళ్ల భోజన వసతికి ఇబ్బందులుండవని కేసీఆర్ చెప్పారు. మొత్తంగా హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ వారిని ఉసిగొల్పేలా చంద్రబాబు కుట్రలకు తెరలేపడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని విజయసాయి ఆరోపించారు.
జగన్ విధానం దేశానికే ఆదర్శం..
మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయగలగడంలో వైసీపీ సర్కారు చాలా వరకు సక్సెస్ అయిందని, సీఎం జగన్ దూరదృష్టి, ప్రజల పట్ల ఆయనకున్న బాధ్యత వల్లే ఇది సాధ్యమైందని ఎంపీ తెలిపారు. కరోనా విషయంలో దేశమంతా భీతిల్లుతున్నా.. సీఎం జగన్ ముందస్తుగానే చర్యలు చేపట్టి, యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి, వైరస్ పై యుద్ధం ప్రకటించిన తీరు అసాధారణమని కొనియాడారు. ఎలాంటి పరిస్థితులనైనా అదుపు చేయగల నాయకుడే ప్రజలకు అవసరమని, ఆ మేరకు దేశమంతా సీఎం జగన్ మార్గాన్ని అనుసరిస్తున్నదని విజయసాయి పేర్కొన్నారు.