6 కాదు 60 వారాలు ఎన్నికలు వాయిదా.. రమేశ్ నిన్న కుక్క, గబ్బిలం.. ఇవాళ కుల పెద్దకు శరణ్యమంటూ..
ఒకదిక్కు ప్రపంచమంతా కరోనా కాటుకు గజగజలాడుతోంది.. మన దగ్గర మాత్రం వైరస్ ఓ రాజకీయ అంశంగా తిష్టవేసింది. వైరస్ ను సాకుగాచూపి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదావేశారని అధికార వైసీపీ మండిపడుతోంటే.. అదే వైరస్ ను బూచిగా చూపెట్టి ఎంపీలో అధికార కాంగ్రెస్ బలపరీక్షను వాయిదా వేసుకుంది. లేని కారణానికి స్థానిక ఎన్నికల్ని వాయిదా వేయడాన్ని బట్టి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమారే అసలైన వైరస్ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైరయ్యారు. ఆదివారం నాటి ప్రెస్ మీట్ లో ఎస్ఈసీని కుక్క, గబ్బిలంతో పోల్చిన విజయసాయి.. సోమవారం కూడా విమర్శల దాడికి కొనసాగించారు.
జనం డబ్బులు తింటూ..
మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు తన కులానికే చెందిన వ్యక్తుల్ని కీలక పోస్టుల్లో ఉంచి, తద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే కుట్రలు చేస్తున్నారని, న్యాయమూర్తిలా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషనర్.. తన కుల పెద్దకు శరణ్యమంటూ సాగిలపడ్డాడని రమేశ్ కుమార్ పై విజయసాయి నిప్పులు చెరిగారు. ప్రజలు చెల్లించే పన్నుల నుంచి జీతాలు తీసుకుంటోన్న రమేశ్ కుమార్.. ఓడిపోయి ఇంట్లో కూర్చున్న చంద్రబాబుకు ఊడిగం చేయడమేంటని ప్రశ్నించారు. ఇలాగైతే వ్యవస్థల పట్ల అపనమ్మకం ఏర్పడే పరిస్థితి వస్తుందని వాపోయారు.
అడ్డంపడితే కరోనా ఆగుద్దా?
ఏపీలో ఇప్పటిదాకా ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాకున్నా.. దాన్ని సాకుగా చూపెట్టి ఏపీలో స్థానిక ఎన్నికల్ని వాయిదా వేసిన వైనం, అందుకు ఎస్ఈసీ రమేశ్ కుమార్ అనుసరించిన విధానాలు అప్రజాస్వామికంగా ఉన్నాయని వైసీపీ ఎంపీ అన్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి జగన్ సర్కారు విస్తృతంగా కృషిచేస్తున్నదని గుర్తుచేస్తూ.. ‘‘ఎన్నికల వాయిదాకు మీకు కరోనా సాకు దొరికిందా? వైరస్ ను నియంత్రించాలని ప్రభుత్వానికి చెప్పాల్సిందిపోయి..ఎన్నికలకు అడ్డంగా పడుకుంటే వైరస్ వ్యాప్తి ఆగుతుందా?''అని నిలదీశారు.
6 కాదు 60 వారాలైనా..
‘‘చంద్రబాబూ.. నీ నీచ రాజకీయాలకు చరమగీతం కూడా నువ్వే పాడుకుంటున్నావు. స్థానిక ఎన్నికల్ని అడ్డుకోవడం ద్వారా రాష్ట్రానికి రూ.5వేల కోట్ల నిధులు రాకుండా చేశావు.. తద్వారా ఐదు కోట్ల మంది ప్రజలకు ద్రోహం తలపెట్టారు. దాని కోసం ఎన్నికల కమిషన్ వ్యవస్థలో ఉన్న నీ మనుషుల్ని వాడుకున్నాయి. ఒకటిమాత్రం నిజం.. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు 6 వారాలు కాదు.. 60 వారాలు వాయిదా పడినా.. టీడీపీ అడ్రస్ గల్లంతుకాక తప్పదు'' అని విజయసాయి మండిపడ్డారు.
Recommended Video
విజయసాయి వివాదం..
స్థానిక సంస్థల ఎన్నికల్ని ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టేక్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయి చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఆదివారం ఎస్ఈసీ ప్రకటన వెలువడ్డ గంటల వ్యవధిలోనే విజయసాయి విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఎస్ఈసీని నిమ్మగడ్డ రమేష్ అనడం కంటే నారా వారి గబ్బిలం అనొచ్చని, ఆయన కరోనా వైరస్ కంటే ప్రమాదకారి అని, కుక్కను బంగారు సింహాసనంపై కూర్చోబెడితే ఏం చేస్తుందో రమేశ్ కూడా అదే పనిచేశాడని వైసీపీ ఎంపీ విమర్శించారు. ఒక స్థాయిని మించి అధికారిని దూషించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.