పవన్ కల్యాణ్కు రొటీన్ సవాల్.. టీడీపీకి బలంలేని చోట జనసేన పోటీ.. జనం నవ్వుకుంటున్నారంటూ..
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం.. చాలా చోట్ల ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అధికార వైసీపీ శ్రేణులు అడ్డుకోవడం.. కొన్ని చోట్ల రాళ్లు, కర్రలతో దాడులకు తెగబడుతుండటం.. మాచర్లలో టీడీపీ నేతలపై హత్యాయత్నం.. తదితర పరిణామాలపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. సీఎం జగన్, ఎన్నికల కమిషన్, పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. కానీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం జనసేనను చూసే జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
రెండు పార్టీలతో పొత్తా?
నోరు తెరిస్తే సిద్ధాంతాలంటూ సంబంధంలేని విషయాలేవేవో మాట్లాడే పవన్ కల్యాణ్.. ఎన్నికల పొత్తుల విషయంలో మాత్రం సైద్ధాంతిక విలువలు, నియమనిబంధనల్ని పాతరేశారని ఎంపీ విజయసాయి ఆరోపించారు. ఒకవైపు అధికారికంగా బీజేపీతో కలిసుంటూనే.. ఇటు అనధికారికంగా టీడీపీతో సీట్ల సర్దుబాటు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. ‘‘పొత్తులకు కూడా కొన్ని విలువలు, నియమాలు ఉంటాయి. అటు బీజేపీతో అంటకాగుతూనే రెండోదిక్కు టీడీపీతో సీట్ల సర్ధుబాటు చేసుకున్న జనసేనను చూసి జనం పగలబడి నవ్వుకుంటున్నారు''అని ఎంపీ మండిపడ్డారు.
పవన్కు సవాల్..
గతంలో చాలా సార్లు పవన్ కల్యాణ్ను చంద్రబాబు భాగస్వామిగా, తాబేదారుగా అభివర్ణించిన విజయసాయి.. తాజాగా ఆద్దరి అపవిత్ర పొత్తును ఉద్దేశించి ఒక సవాలు విసిరారు. నిజానికి టీడీపీకి అభ్యర్థులు లేని చోటల్లా ఆయా స్థానాలను జనసేనకు వదిలేశామని పచ్చతమ్ముళ్లే బాహాటంగా చెబుతున్నారని, ఇంతగా దిగజారిన తర్వాతైనా జనసేన కనీసం ఒక్కటంటే ఒక్క మండల పరిషత్తులోనైనా కచ్చితంగా గెలుస్తుందని జనసేనాని చెప్పగలడా? అని సవాలు విసిరారు.
గతాన్ని మర్చిపోయారా?
ఏపీలో ఎన్నికల ప్రక్రియను భ్రష్టుపట్టించిన ఘన చరిత్ర చంద్రబాబుదేనని, అలాంటి వ్యక్తి ఇవాళ.. ఎన్నికల్లో అక్రమాలు, అరాచకాల గురించి సుద్దులు చెప్పడం వింతగా ఉందని విజయసాయి మండిపడ్డారు. గతంలో వైసీపీకి చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను బెదిరించి.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను గెలిపించుకున్న ఘటనల్ని అంత సులువుగా మర్చిపోగలమా? అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లాగే స్థానిక ఎన్నికల్లోనూ జనం వైసీపీకి పట్టం కట్టబోతున్నారన్న సంగతి అర్థమై, ఇక తాము గెలవలేమని నిర్ధారించుకున్న తర్వాతే బాబు, పవన్ లాంటివాళ్లు బురద చల్లే కార్యక్రమానికి పూనుకున్నారని విమర్శించారు.
ఎన్నికల తర్వాత సీన్ ఇదే..
ప్రతిసారి ఎన్నికలప్పుడు గెలవడం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారతాడని, అదే అలవాటు ప్రకారం.. పోలీసులు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు కులాలను ఆపాదిస్తూ.. వాళ్లను అధికార పార్టీ సానుభూతిపరులుగా ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నాడని, ఈ తప్పుడు ప్రచారాన్ని తన ఎల్లో మీడియా కమ్మగా వండివార్చుతుందని, తద్వారా ప్రజల్ని భ్రమింపజేయోచ్చనే ఆలోచన టీడీపీ అధినేతదని విజయసాయి ఆరోపించారు. తీరా ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం ‘‘అయ్యో.. నేనెందుకు ఓడిపోయానో అర్థం కావడంలేదే..''అని చంద్రబాబు శోకాలు పెడతారని వైసీపీ ఎంపీ ఎద్దేవా చేశారు.
Recommended Video
కీలక తేదీలివే..
ఏపీలో మూడంచెల స్థానిక సంస్థలకు వరుసగా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 21న ఎంపీటీసీ, జెడ్పీటీపీ ఎన్నికలు, 23న మున్సిపాలిటీ ఎన్నికలు, 27,29 తేదీల్లో రెండు విడతల్లో పంచాయితీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక ఫలితాల విషయానికొస్తే.. 24న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, 27న మున్సిపల్, 27,29 తేదీల్లో పంచాయితీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.