చంద్రబాబు ఉస్కో అన్నప్పుడల్లా స్థానిక నోటిఫికేషన్: తిరుపతి ఉప ఎన్నికే లాస్ట్: ఆ తరువాత
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ను జారీ చేయడం పట్ల వ్యతిరేకత ఎదురవుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఆయనపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతోంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల వ్యవహారం అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తోంది. అమ్మఒడి పథకాన్ని అడ్డుకోవడానికే హడావుడీగా రమేష్ కుమార్ షెడ్యూల్ను విడుదల చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపణలను గుప్పిస్తున్నారు.
చంద్రబాబు ఆదేశాలతో
వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్తో పాటు చంద్రబాబుపైనా విమర్శలను సంధించారు. సంక్షేమ పథకాలను అమలు చేయడాన్ని అడ్డుకోవాలనే కారణంతో ఉద్దేశపూరకంగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఆయన విడుదల చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడి ఆదేశాలతోనే ఆయన కనీసం ప్రభుత్వాన్ని కూడా సంప్రదించకుండా షెడ్యూల్ను ప్రకటించాని మండిపడ్డారు.
అధికార యంత్రాంగానికి బాధ్యత లేదనుకుంటున్నారా?
చంద్రబాబు ఉస్కో అన్నప్పుడల్లా స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంటుందని భగ్గుమన్నారు. రమేష్ కుమార్ వెనుక ఎవరు ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమేనని గుర్తు చేశారు. ఇదివరకు కరోనా వైరస్ కేసులు తక్కువగా ఉన్న సమయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలను వాయిదా వేసిన రమేష్ కుమార్.. ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా షెడ్యూల్ను విడుదల చేశారని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగించాల్సిన అధికార యంత్రాంగం ప్రభుత్వంలో భాగమనే విషయాన్ని ఆయన విస్మరించారని అన్నారు.
సంక్షేమ పథకాలను అడ్డుకోవాలనే లక్ష్యంతో
అయిదు కోట్ల మంది ప్రజల గురించి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏ మాత్రం బాధ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరతో సంక్షేమ పథకాలను అడ్డుకోవాలనే ఏకైక లక్ష్యంతో టీడీపీ రాజకీయాలను సాగిస్తోందని ఆరోపించారు.. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల తరువాత టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందని జోస్యం చెప్పారు. పార్టీ గల్లంతు కావడానికి ముందే ఏదో ఒకటి చేయాలనే స్వామి భక్తి నిమ్మగడ్డదని చురకలు అంటించారు. వయసు, అనుభవం పెరిగే కొద్ది చంద్రబాబు హూందాగా వ్యవహరించాల్సిన చంద్రబాబు మరింత దిగజారుతున్నారని విమర్శించారు.
ప్రజలకు సైతం వెన్నుపోటు..
ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి ఆయనను, ఆయన పార్టీని మూలన కూర్చోబెట్టారని, ఆ కోపంతోనే సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో వెన్నుపోటు పొడిపించుకోవడానికి ప్రజలు ఎవరైనా ఆయనను నమ్మాల్సి ఉంటుందని, చివరికి ఆ నమ్మకం కూడా కోల్పోయారని విమర్శించారు. తనను ఓడించిన ప్రజలకు వెన్నుపోటు పొడవాలనే కారణంతోనే ఆయన కరోనా వైరస్ పాజిటివ్ కేసులను పెంచడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ రకంగా తనను ఓడించిన ప్రజలకు వెన్నుపోటు పొడవాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు.