జనం ఉమ్మేస్తారన్న సిగ్గు లేదు.. బాబు అరెస్టు ప్రతీకారమేనని ఒప్పుకున్న వైసీపీ.. ఏమన్నారంటే..
''కొండపై నుంచి జారిపడుతూ మధ్యలో కొమ్మను పట్టుకుని వేలాడుతున్న పరిస్థితి చంద్రబాబుది. ఏ క్షణంలోనైనా కొమ్మ విరగొచ్చు లేదా పట్టుతప్పి తానే అగాథంలోకి పడిపోవచ్చు. అంత నిస్సహాయతలో కూడా 'ఒక్కొక్కరి భరతం పడతా, ఎవర్నీ వదిలి పెట్టేది లేదు' అని బెదిరిస్తున్నాడంటే ఆయనది మామూలు 'గుండె' కాదు'' అంటూ సెటైర్లు సంధించిన కొద్ది గంటలకే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి శుక్రవారం మరోసారి ప్రతిపక్ష నేతపై విరుచుకుపడ్డారు. ఈసారి విమర్శల డోసు పెంచుతూ ఉమ్మేసేదాకా వెళ్లారు.
సిగ్గులేకుండా..
విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు కానుండగా.. దానిని వ్యతిరేకిస్తూ చంద్రబాబు యాత్ర చేయాలని ప్రయత్నించినందుకే జనం ఆయనను అడ్డుకున్నారని ఎంపీ విజయసాయి చెప్పారు. ప్రజలు కాండ్రించి ఉమ్మేస్తారనే సిగ్గు కూడా లేకుండా చంద్రబబు ప్రవర్తిస్తున్నాడన, ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోన్న ఉత్తరాంధ్రను పరిపాలనా రాజధాని చేయాలని సీఎం జగన్ నిర్ణయిస్తే.. దానికి వ్యతిరేకంగా బస్సు యాత్ర చేపట్టమేంటని ప్రశ్నించారు. అమరావతి కోసం ఉత్తరాంధ్ర ప్రజల నోటి దగ్గర ముద్దను లాక్కోవటమేంటని నిలదీశారు.
కోట్ల సొమ్ము నీళ్లపాలు..
చంద్రబాబు హయాంలో ఆఫీసుల్లో వాటర్ బాటిళ్ల ఖర్చు కోటాను కోట్లుగా ఉండిందని వైసీపీ ఎంపీ గుర్తుచేశారు. బడిపిల్లలకు చెందాల్సిన డబ్బుల్ని హిమాలయా వాటర్ కోసం ధారపోశారని మండిపడ్డారు. చంద్రబాబుకు విరుద్ధంగా సీఎం జగన్.. జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి కింద ఏటా 15 వేలు, కాలేజీ విద్యార్థులకు వసతి దీవెన కింద రూ.20 వేలు ఇస్తూ, ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయిస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం వైసీపీ సర్కారు రూపొందించిన ఇలాంటి పథకాలు దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కనిపించవని విజయసాయి చెప్పుకొచ్చారు.
నిజం ఒప్పుకున్నట్లేనా?
వివాఖ ఎయిర్ పోర్టు వద్ద గురువారం చంద్రబాబు అడ్డగింత, అరెస్టు, బలవంతంగా వెనక్కి పంపడం లాంటి పరిణామాలు.. మూడేళ్ల కిందట అదే ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేతగా జగన్ కూడా ఎదుర్కొన్నారు. దీంతో జగన్ తన పగతీర్చుకున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చారు. దీనిపై రెండు పార్టీల నేతలూ నేరుగా స్పందించలేదు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం.. నాటి ఘటనకు ప్రతీకారమే బాబు అరెస్టు అనే అర్థం వచ్చేలా నిజాన్ని పరోక్షంగా ఒప్పుకున్నట్లు కనిపించింది.
చించుకోవడం ఎందుకు?
‘‘ఏం చట్టం కింద నన్ను అరెస్టు చేసి వెనక్కి పంపుతారని చంద్రబాబు బట్టలు చించుకుంటున్నాడు. ప్రజల మధ్య విష బీజాలు నాటే వాళ్లను వంద సెక్షన్ల కింద బుక్ చేసి లోపలికి నెట్టొచ్చు. అయినా, కొన్నేళ్ల కిందట స్పెషల్ స్టేటస్ డిమాండ్ తో వైజాగ్ లో ఆందోళ చేయడానికొచ్చిన జగన్ ను, వైసీపీ నేతలను అప్పటి సీఎం చంద్రబాబు ఏ చట్టం కింద అరెస్టు చేశాడు? ఏ నిబంధన ప్రకారం ఎయిర్ పోర్టు నుంచే తిరిగి వెనక్కి పంపారు?''అని విజయసాయి ప్రశ్నించారు.
Recommended Video
బాబు అరెస్టుపై భగ్గు..
విశాఖపట్నంలో చంద్రబాబు అరెస్టు, బలవంతంగా హైదరాబాద్ కు తరలింపుపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. వైసీపీ సర్కారు తీరును నిరసిస్తూ శుక్రవారం పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. బాబును అడ్డుకున్న అదే చోటు నుంచి మళ్లీ యాత్ర ప్రారంభిస్తామని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ శపథం చేశారు. సీఎం జగన్ తుగ్లక్ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాబోయేరోజుల్లో మరింతగా ఉద్యమిస్తామని ఆయన చెప్పారు.