నాయుళ్లిద్దరూ తప్పిపోయారు- వ్యాన్ ఎక్కించి ఏపీకి పంపేయరూ-కేసీఆర్ కు సాయిరెడ్డి ట్వీట్..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఎమ్మెల్సీ లోకేష్ ను ఉద్దేశించి నిత్యం ట్వీట్లు పెట్టే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వారినుద్దేశించి ట్వీట్ పెట్టారు. లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లో ఉండిపోయిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. చంద్రబాబు విశాఖ గ్యాస్ లీక్ బాధితుల పరామర్శ కోసం కేంద్రం అనుమతి కోరడం, వారు స్పందించకపోవడాన్ని కూడా సాయిరెడ్డి ట్వీట్ లో ప్రస్తావించారు.
సాయిరెడ్డి తన ట్వీట్ లో ఎక్కడా చంద్రబాబు, లోకేష్ పేర్లు వాడకుండానే... పెదనాయుడు, చిననాయుడు అనే పేర్లను ప్రస్తావించారు. పెదనాయుడు, చిననాయుడు అనే తండ్రీ కొడుకుల కుటుంబం ఏపీ నుంచి తప్పిపోయి హైదరాబాద్ లో ఉండిపోయిందని, వారిద్దరినీ బలవంతంగా వ్యాన్ ఎక్కించి మా రాష్ట్రానికి పంపాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ ఉంది. లాక్ డౌన్ పేరుతో చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ లోనే ఉండిపోవడాన్ని తప్పుబడుతూ వారిని ఎలాగైనా ఏపీకి పంపాలని సాయిరెడ్డి కోరుతున్నట్లుగా ఈ ట్వీట్ ఉంది.
అలాగే తాజాగా విశాఖ ఎల్టీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన బాధితులను పరామర్శించేందుకు చంద్రబాబు కేంద్రం అనుమతి కోరడం, వారు స్పందించకపోవడాన్ని కూడా సాయిరెడ్డి ప్రస్తావించారు. ఫ్లైట్ లోనే వైజాగ్ వెళ్తానని మారాం చేస్తున్నావ్.. కారులో అయితే ఆరేడు గంటల ప్రయాణమే కదా అంటూ చంద్రబాబును ఉద్దేశించి సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లోనే ఉండిపోయిన చంద్రబాబు.. ముంబైలో ఉన్న ప్రత్యేక ఫ్లైట్ ను తన కోసం హైదరాబాద్ పంపాలని, అందులో విశాఖ వెళ్లేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో సాయిరెడ్డి ట్వీట్ లో చంద్రబాబుకు చేసిన సూచనలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.