ఫైబర్ నెట్ ప్రాజెక్టు వెనుక రూ.10 వేల కోట్ల కుంభకోణం
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు వెనుక భారీ కుంభకోణం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టును పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా నెలకొల్పిన కార్పొరేషన్ లో 10 వేల కోట్ల రూపాయల మేర కుంభకోణం దాగి ఉందని ఆయన అన్నారు. దీనిపై దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అరసు పేరుతో ఇదే తరహా ప్రాజెక్టును తమిళనాడులో చేపట్టారని, అది దారుణంగా విఫలమైందని గుర్తు చేశారు. అరసు ప్రాజెక్టును కాపీ కొట్టి చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ ను అమలు చేస్తున్నారని విమర్శించారు.
తనకు డప్పు కొట్టని టీవీ ఛానెళ్ల సిగ్నళ్లను అడ్డుకోవడానికే ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని విజయసాయి రెడ్డి విమర్శించారు. ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి 10 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. చివరికి- ఉద్యోగులకు జీతాలను కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఖజానాను తీసుకొచ్చారని ఆరోపించారు. ఎన్నికల ప్రచార సమయంలో హైదరాబాద్ నుంచి కోటి రూపాయలు రాజమండ్రికి తరలిస్తూ పట్టుబడిన కేసులో ముద్దాయి మురళీ మోహన్ ఎక్కడ ఉన్నారని సాయిరెడ్డి ప్రశ్నించారు. పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతో ఆయన విశాఖపట్నంలో తలదాచుకున్నట్టు వార్తలు వస్తున్నాయని చెప్పారు.
మురళీమోహన్ ఎక్కడ ఉన్నారో తెలిసినా, పోలీసులు ఆయనను ఎందుకు అరెస్టు చేయట్లేదని నిలదీశారు. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి సీబీఐ కళ్లుగప్పి తిరుగుతున్నారని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు మే 23 తర్వాత ఇంకెంత మంది అజ్ణాతంలోకి వెళ్తారోనని సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. న్యాయ వ్యవస్థ, సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, విజిలెన్స్ కమిషన్ వంటి సంస్థల్లోకి తన వాళ్లను తెలివిగా జొప్పించగలిగానని చంద్రబాబు చెప్పుకొంటున్నారని, అలాగే- ఎన్నికల సంఘంలో కూడా తన వాళ్లను ఉండేలా చూసుకుని ఉంటే ఇన్ని కష్టాలుండేవి కాదని ఆయన తెగ బాధపడుతున్నారని సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.