ముఖ్యమంత్రి సహాయ నిధికి కడప ఎంపీ భారీగా నిధులు కేటాయింపు: కరోనా నివారణ చర్యల కోసం..!
కడప: రాష్ట్రంలో భయానకంగా విస్తరిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోన్న నివారణ చర్యల కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి భారీ నిధులను కేటాయించారు. తన ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి రెండు కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి చెల్లించనున్నట్లు తెలిపారు.
లేని రోగాలు అంటిస్తారా? కరోనా ఐసొలేషన్ వార్డులు మాకెందుకు?: టీడీపీ ఎంపీ కేశినేని నాని:
వైఎస్ఆర్సీపీకి చెందిన పార్లమెంట్ సభ్యులు ఇప్పటికే తమ మూడు నెలల వేతనాన్ని అటు ప్రధానమంత్రి సహాయ నిధికి, ఇటు ముఖ్యమంత్రి సహాయ నిధికి కేటాయించిన విషయం తెలిసిందే. దీనికి అదనంగా- వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీల్యాడ్స్ నుంచి రెండు కోట్ల రూపాయలను చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. కరోనా నివారణ కోసం తీసుకుంటోన్న చర్యలకు తనవంతు ఆర్థిక సహకారాన్ని అందించడానికి ఈ మొత్తాన్ని వెల్లడించినట్లు తెలిపారు.
Recommended Video
వైఎస్ఆర్సీపీకే చెందిన ఎంపీలు వల్లభనేని బాలశౌరి (మచిలీపట్నం), రఘురామ కృష్ణంరాజు (నరసాపురం), చింతా అనూరాధ (అనకాపల్లి), తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేశినేని నాని (విజయవాడ), కింజరాపు రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం) ఇప్పటికే ఎంపీల్యాడ్స్ నిధులను కేటాయించారు. తాజాగా- వైఎస్ అవినాష్ రెడ్డి ఈ మొత్తాన్ని ప్రకటించారు. తన లోక్సభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి పార్లమెంట్ సభ్యుడికీ కేంద్రం ఎంపీల్యాడ్స్ కింద నిధులను కేటాయిస్తుందనే విషయం తెలిసిందే.