చంద్రబాబు దోపిడీకి అదే పెద్ద సాక్ష్యం: ఏకిపారేసిన వైవీ సుబ్బారెడ్డి
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుపై వైయస్సార్ కాంగ్రెస్పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Recommended Video
హైదరాబాద్: టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుపై వైయస్సార్ కాంగ్రెస్పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుడితోపాటు గుడిలో లింగాన్ని మింగేయాలని చూస్తున్నారని, పాపభీతి లేకుండా ఆలయ భూములను కాజేస్తున్నారని ధ్వజమెత్తారు. మూడేళ్లుగా చంద్రబాబు చేస్తున్న భూ కుంభకోణాలు, భూపందేరాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు దోపిడీకి మచ్చుతునక
మంగళవారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు భూ దోపిడీకి సదావర్తి భూముల వేలం వ్యవహారం ఓ మచ్చుతునక అని అన్నారు. సదావర్తి భూములను బాబు ప్రభుత్వం తమ బినామీకి రూ.22.4 కోట్లకే కట్టబెట్టిందని, అయితే, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయపోరాటం చేసి మరోసారి వేలం నిర్వహించేలా చేశారని తెలిపారు.
అదనంగా రూ.38కోట్లు వచ్చాయి..
మళ్లీ వేలం నిర్వహించడంతో రూ.60.30కోట్ల ధర పలికిందని, దీని వల్ల అదనంగా రూ.38కోట్లు సమకూరి బ్రాహ్మణులకు మేలు జరిగిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అమరేశ్వరుడి భూములను దోచుకున్న విధంగా టీడీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దేవాలయం భూముల దోపిడీలను ప్రజలు తమ దృష్టికి తెస్తే న్యాయ పోరాటం చేసి అండగా నిలుస్తామని చెప్పారు.
బాబు అవినీతిపై పోరాటం..
చంద్రబాబు అవినీతిని అరికట్టేందుకు ప్రజలంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలన్నారు. సదావర్తి సత్రం భూములకు సోమవారం చెన్నైలో మరోసారి జరిగిన వేలం నిష్పక్షపాతంగా లేదని వైవీ మీడియా అడిగిన ఓప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
వెయ్యి కోట్ల ఆదాయం.. వారెందుకొచ్చారు?
టీడీపీకి చెందిన మంత్రులు కోర్టు అనుమతి లేకుండా వేలంపాటలో ఎందుకు పాల్గొన్నారని ప్రశ్నించారు. వారి బెదిరింపుల వల్లే వేలం సక్రమంగా జరగలేదని ఆరోపించారు. వేలం సక్రమంగా జరిగి ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్లుగా రూ. వెయ్యి కోట్ల వరకు ఆదాయం వచ్చి ఉండేదని అన్నారు.