జగన్ యూటర్న్: ఆ చట్టం అమలుకు గ్రీన్ సిగ్నల్.. ఇప్పుడేమో వ్యతిరేకమని ప్రకటన
జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొద్దిరోజులకే జగన్ సర్కార్ యూటర్న్ తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద ఎన్ఆర్సీ, ఎన్పీఆర్,సీఏఏ చట్టాలను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని వైసీపీ లోక్సభపక్ష నేత మిథున్రెడ్డి స్పష్టం చేశారు. ఈ చట్టాల కారణంగా దేశంలోని మైనారిటీలు అభద్రతా భావంలోకి నెట్టబడ్డారని, ఎన్పీఆర్లో అడుగుతున్న సమాచారం గతం కంటే భిన్నంగా ఉందని అన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు. మైనారిటీలకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలబడుతుందన్నారు. జాతీయ బడ్జెట్ నేపథ్యంలో పార్లమెంట్ లైబ్రరీ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశ అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అఖిలపక్ష భేటీలో :
ఎన్ఆర్సీ,సీఏఏ, ఎన్ఆర్పీలకు తమ పార్టీ వ్యతిరేకమని అఖిలపక్ష భేటీలో వెల్లడించినట్టుగా మిథున్ రెడ్డి తెలిపారు. ఈ చట్టాలకు తాము వ్యతిరేకమని గత లోక్సభలోనే చెప్పినట్టుగా వెల్లడించారు. మైనారిటీ సోదరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాము పోరాడుతామని చెప్పారు. ఈ చట్టాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు,అభివృద్దికి సంబంధించిన పలు అంశాలను భేటీలో ప్రస్తావించినట్టు చెప్పారు.
భేటీలో ప్రస్తావించిన అంశాలు..
అఖిలపక్షంలో డిమాండ్ చేసిన అంశాలను ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. కాగ్ ఆడిట్ ప్రకారం రెవెన్యూ లోటు నిధులు విడుదల చేయాలని.. రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు తగిన నిధులు కేటాయించాలని కోరినట్టు చెప్పారు. అలాగే రాజ్ భవన్, సెక్రటేరియట్, హైకోర్టు సహా మౌలిక వసతుల నిర్మాణాలకు అవసరమైనా నిధులు కేటాయించాలని చెప్పామన్నారు. రెవెన్యూ లోటు గ్రాంట్ కింద ఇప్పటికే రాష్ట్రానికి అందాల్సిన రూ.18, 969 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరామన్నారు. ఇక వెనకబడిన జిల్లాల గ్రాంట్ కింద రూ. 23 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 3,283 కోట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 55,548 కోట్లను కేంద్ర ఆమోదించాలని కోరామన్నారు.
మండలి రద్దుపై..
శాసనమండలి రద్దు తీర్మానంపై త్వరలోనే అవసరమైన ప్రక్రియలన్నీ పూర్తయి కేంద్ర హోంశాఖకు వెళ్తుందన్నారు విజయసాయి రెడ్డి. ఆ తర్వాత న్యాయశాఖకు,అక్కడినుంచి కేబినెట్కు వెళ్తుందన్నారు. ఆపై రాజ్యసభ,లోక్సభలో ప్రవేశపెట్టబడుతుందని.. అక్కడ ఆమోదం పొందితే రాష్ట్రపతికి చేరుతుందన్నారు. ఇక రాష్ట్రంలో రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్కు కేంద్ర ఆర్థిక సహాయంతో పాటు కేపిటల్ సిటీ అభివృద్ది గ్రాంట్ కింద రూ.47,424కోట్లు అడిగినట్టు విజయసాయి రెడ్డి చెప్పారు. అలాగే రాష్ట్రానికి పరిశ్రమల రాయితీలు,ప్రోత్సహాకాలు ప్రకటించాలని కోరామన్నారు.
జగన్ యూటర్న్..
ఇదిలా ఉంటే, జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కొద్ది రోజుల క్రితమే వైసీపీ ప్రభుత్వం జీవో.124 విడుదల చేసింది. ప్రజల్లో ఎన్పీఆర్పై భయాలు, అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటికి వివరణలు కూడా అందులో జోడించినట్టు చెప్పింది. కానీ ఇంతలోనే ఎన్పీఆర్,ఎన్ఆర్సీలకు వ్యతిరేకమంటూ కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో వైసీపీ ఎంపీలు పేర్కొనడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి వస్తున్న అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎన్పీఆర్పై జగన్ సర్కార్ పున:సమీక్షించుకున్నట్టు సమాచారం.