తక్షణం జోక్యం చేసుకోండి..: రాష్ట్రపతికి జగన్, క్విడ్ ప్రోకో అన్న లోకేష్..
హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో అధికార పార్టీ కంటే తామే ముందున్నామని వైసీపీ సంకేతాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీలు తాజాగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వినతిపత్రం అందజేయడం గమనార్హం. వైసీపీ అధినేత జగన్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
తమ పార్టీ ఎంపీలు మంగళవారం రాష్ట్రపతిని కలిసి లేఖలు అందించినట్టు తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రపతి తక్షణం జోక్యం చేసుకుని రాష్ట్రానికి హోదా ఇచ్చేలా కేంద్రానికి సూచించాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీలు రాష్ట్రపతికి సమర్పించిన లేఖ ప్రతిని పోస్టు చేశారు.
Furthering our fight for SCS, YSRCP MPs called on Hon'ble President of India Shri RamNath Kovindji & submitted a letter requesting his urgent intervention to prevail upon the Union Govt, to grant special status to AP, as promised on the floor of the House. pic.twitter.com/Aio12dit6y
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 17, 2018
జగన్ లేఖ మరో క్విడ్ప్రోకో: లోకేశ్
రాష్ట్రపతికి వైసీపీ అధినేత జగన్ లేఖలు రాయించడంతో మరోసారి 'క్విడ్ప్రోకో' బయటపడిందని మంత్రి లోకేష్ ఆరోపించారు. తిరువూరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీడీపీలో చేరిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హోదాపై రాష్ట్రపతికి లేఖ రాశారు గానీ.. అందులో ఎక్కడా ప్రధాని గురించి ప్రస్తావించకపోవడం వైసీపీ అసలు రంగును బయటపెట్టిందని అన్నారు. ఒకపక్క సభలో మోడీ కాళ్లు పట్టుకుంటారని, మరోపక్క అదే పార్టీ ఎంపీలు ప్రధానికి వ్యతిరేకంగా మౌనవ్రతం చేపడుతారని, ఇవన్నీ డ్రామాలని కొట్టిపారేశారు.