వెంకయ్యను కలిసిన విజయసాయి, ఆనందం: షాక్కు గురైన టిడిపి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయ సాయి రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు మంగళవారం వెంకయ్య నాయుడును కలిశారు.
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయ సాయి రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు మంగళవారం వెంకయ్య నాయుడును కలిశారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థి కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవికి సరైన వ్యక్తి అని చెప్పారు. వెంకయ్య ఏ పదవిలో ఉన్న తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తారన్నారు.
ఎన్టీఆర్కు అండగా నిలవడం నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థి దాకా: ఇదీ వెంకయ్య
తెలుగు వ్యక్తికి ఉన్నత పదవి రావడం హర్షణీయం, సంతోషకరమైన విషయమని చెప్పారు. వెంకయ్య నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని తాము నమ్ముతున్నామని చెప్పారు.
వెంకయ్య మంగళవారం ఉదయం బిజెపి అగ్రనేత అద్వానీ ఇంటికి వెళ్లారు. అద్వానీతో పాటు మురళీ మనోహర్ జోషిల ఆశీర్వాదం తీసుకున్నారు.
టిడిపి ఆవేదన
వెంకయ్య నాయుడు, చంద్రబాబు మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన లాబీయింగ్ ద్వారా టిడిపికి లబ్ధి చేకూరుతోందనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు వెంకయ్య ఉప రాష్ట్రపతిగా అయితే అది టిడిపికి బాధ, వైసిపికి సంతోషకరమైన విషయమనే వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కూడా మాట్లాడుతూ.. వెంకయ్య లాంటి వ్యక్తి క్రియాశీలక రాజకీయాలకు దూరం కావడం బాధాకరమే అయినా ఉన్నత పదవులు పొందినప్పుడు సంతోషించాలన్నారు.
Recommended Video
సంతోషమే కానీ, రాజకీయాల్లో ఉంటే బాగుండేది
వెంకయ్య ఎంపిక పట్ల శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, పలువురు రాష్ట్ర మంత్రులు పలువురు హర్షం ప్రకటించారు. ఉపముఖ్యమంత్రులు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మంత్రులు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, శిద్ధా రాఘవరావు, నారా లోకేష్, కామినేని శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, అమర్నాథ్ రెడ్డి, నక్కా ఆనందబాబు, అచ్చెన్నాయుడు, నారాయణ, ఎంపీ కేశినేని నాని తదితరులు వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు. అయితే దక్షిణాదికే పెద్ద దిక్కయిన వెంకయ్య మరికొంతకాలం పాటు క్రియాశీల రాజకీయాల్లో కొనసాగితేనే బాగుంటుందని, లేకుంటే రాష్ట్రానికి కొంత నష్టం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఈ నిర్ణయంతో టిడిపి షాక్కు గురైందని చెప్పవచ్చు.
వెంకయ్య సహకరించారని సుజనా
వెంకయ్యను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంపై సుజనా చౌదరి హర్షం వ్యక్తంచేశారు. ఇది ప్రపంచంలోని తెలుగువారందరూ గర్వించదగ్గ విషయమన్నారు. 1972లో విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఒకే పార్టీని నమ్మి సిద్ధాంతపరంగా ఈ స్థాయికి ఎదగటం హర్షించదగ్గ విషయమన్నారు. విభజన అనంతరం అనేక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు రాష్ట్రానికి వెంకయ్య సహకరించారన్నారు.
కేసీఆర్ సూచన మేరకు.. కవిత
దక్షిణాది వ్యక్తిని ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేయడం చాలా సంతోషకరమని, ఆ పదవికి వెంకయ్య తగిన వ్యక్తి అని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు పార్టీ తరఫున వెంకయ్యకు సంపూర్ణ మద్దతు ప్రకటించామన్నారు. ప్రధాని మోడీ మాటను కేసీఆర్ గౌరవించి వెంకయ్యకు మద్దతు ప్రకటించారన్నారు. మూడేళ్ల నుంచి పార్లమెంటులో వెంకయ్య పనితీరును ప్రత్యక్షంగా గమనించానన్నారు.
బిజేపీ నేతలు
వెంకయ్యను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం తెలుగు జాతికి అరుదైన గౌరవమని బిజెపి తెలంగాణ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డిలు చెప్పారు. రాజకీయాల్లో వెంకయ్య స్నేహశీలి, విలువలు కలిగిన నేతని బిజెపి ఏపీ అధ్యక్షులు కంభంపాటి హరిబాబు అన్నారు.