ఇద్దరు వైసీపీ ఎంపీలకు లోక్సభలో నో ఎంట్రీ: ఢిల్లీలో ఐసొలేషన్కు తరలింపు: కారణం ఇదే
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు లోక్సభ సభ్యులు కరోనా వైరస్ బారిన పడ్డారు. వారికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. దీనితో వారిద్దరినీ అధికారులు ఐసొలేషన్కు తరలించారు. 14 రోజుల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. చిత్తూరు, అరకు ఎంపీలు ఎన్ రెడ్డెప్ప, గొడ్డేటి మాధవికి కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం వారిద్దరూ ఢిల్లీలో ఉన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లారు.
కావాలనే కరోనా సృష్టి: వుహాన్ ల్యాబ్లో తయారీ: వైరస్ పుట్టుకపై చైనా వైరాలజిస్ట్ కుండబద్దలు
రాజ్యసభ, లోక్సభ సమావేశాల ప్రారంభానికి ముందు సభ్యులందరికీ వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డెప్ప, గొడ్డేటి మాధవికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. రెడ్డెప్పలో ఎలాంటి వైరస్ లక్షణాలు కనిపించలేదు. అసింప్టోమేటిక్గా ఆయనను నిర్ధారించారు. జ్వరం గానీ, దగ్గు గానీ లేదు. శ్వాసకోశ ఇబ్బందులూ ఆయనలో లేవు. అయినప్పటికీ.. అధికారులు నిర్వహించిన టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్ సోకినట్లు వెల్లడైంది.
గొడ్డేటి మాధవిలో మాత్రం జ్వరం లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట జ్వరంతో బాధపడిన ఆమె కోలుకున్నారు. జ్వరం తగ్గడంతోనే ఆమె పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడానికి ఢిల్లీ వెళ్లారు. అక్కడ కరోనా లక్షణాలు వెలుగు చూడటంతో ఇద్దరు ఎంపీలను అధికారులు ఐసొలేషన్కు తరలించారు. 14 రోజుల పాటు చికిత్స తీసుకోవాలని సూచించారు. కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే సమావేశాల్లో పాల్గొనడానికి అనుమతి ఇచ్చారు.
Recommended Video
ఇప్పటికే పలువురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. కొత్తగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదివరకు పలువురు వైసీపీ ఎమ్మెల్యేకు ఈ వైరస్ సోకింది. వారిలో కొందరు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు. వైసీపీ సీనియర్ నేత, పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయి రెడ్డి కరోనా నుంచి బయటపడ్డారు.
ఇదిలా ఉంటే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఎంపీలు అందరికీ కరోనావైరస్ పరీక్షలు నిర్వహించగా మొత్తం 25 మంది ఎంపీలకు కరోనావైరస్ పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ఇందులో 17 మంది లోక్సభ ఎంపీలు ఉండగా మరో 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. లోక్సభ ఎంపీల్లో 12 మంది బీజేపీ ఎంపీలు ఉండగా ఇద్దరు వైసీపీ ఎంపీలు ఒకరు శివసేన ఎంపీ, డీఎంకే మరియు ఆర్ఎల్పీల నుంచి చెరో ఒక ఎంపీకి కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. భౌతిక దూరం పాటించి సభ నిర్వహణ జరుగుతున్న నేపథ్యంలో 25 మంది ఎంపీలకు కరోనా వైరస్ సోకడంతో మిగతా ఎంపీల్లో ఆందోళన ప్రారంభమైంది.ఇక కరోనా నేపథ్యంలో లోక్సభను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహించనుండగా రాజ్యసభను మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరగనుంది. సభ్యులు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.