కుప్పం పంచాయితీలోనూ మాదే గెలుపు -అమిత్ షాపై రాళ్లదాడి, కాళ్లబేరాలా? -చంద్రబాబుపై వైసీపీ ఫైర్
ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో చోటుచేసుకున్న హింసపై ప్రతిపక్ష టీడీపీ.. కేంద్రానికి ఫిర్యాదు చేయడాన్ని వైసీపీ తీవ్రంగా ఖండిచింది. చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ ఎంపీల బృందం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవగా, ఆ భేటీపై వైసీపీ ఎంపీలు నిప్పులు చెరిగారు. అమిత్ షా ఎన్నటికీ చంద్రబాబును నమ్మబోరని, కేంద్రానికి దగ్గరయ్యేందుకే చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, అమిత్ షాతో టీడీపీ ఎంపీల భేటీపై బీజేపీ నేతలు మౌనంగా ఉండిపోగా.. వైసీపీ మాత్రమే విమర్శలకు దిగుతుండటం మరోరకమైన చర్చకు దారితీసింది.
షాక్: పాకిస్తాన్పై మరో సర్జికల్ స్ట్రైక్ -2న అర్ధరాత్రి ఘటన -తన జవాన్ల కోసం ఇరాన్ సంచలన చర్య
షా చుట్టూ ఏపీ పాలిటిక్స్
ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీలకు చెందిన ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో మకాం వేశారు. కేంద్ర పెద్దలు కూడా అందుబాటులో ఉండటంతో వారిని కలిసి ఏపీలో పరిణామాలపై ఫిర్యాదులు, వివరణలు ఇస్తున్నారు. ప్రధానంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. కనకమేడల నేతృత్వంలోని టీడీపీ ఎంపీల బృందం.. బుధవారం ఢిల్లీలో అమిత్ షాను కలిసి, ఏపీలో జగన్ అరాచకపాలపై ఫిర్యాదులు చేసింది. వైసీపీకే చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం షాను కలిసి ఏపీలో ఆలయాలపై దాడుల అంశాన్ని లేవనెత్తారు. కాగా, టీడీపీ ఎంపీలు షాను కలవడాన్ని వైసీపీ ఎంపీలు తప్పుపడుతూ...
చంద్రబాబును బీజేపీ నమ్మదు..
టీడీపీ అధినేత చంద్రబాబు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమని, రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తోన్న ఆయనే.. తన పార్టీ ఎంపీలను కేంద్ర హోం మంత్రి దగ్గరకు పంపించి, జగన్ సర్కారుపై ఫిర్యాదులు చేయించడం సిగ్గుమాలిన చర్య అని వైసీపీ ఎంపీలు విమర్శించారు. చంద్రబాబు వైఖరి అందితే జుట్టు, అందకపోతే కాళ్లు అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. పూటకో పార్టీతో జతకట్టే చంద్రబాబు, కేసుల నుంచి తప్పించుకునేందుకు కేంద్రంతో తిరిగి దోస్తీ కట్టేందుకు తహతహలాడుతున్నారని, చంద్రబాబు ఊసరవిల్లి వైఖరిని బీజేపీ పెద్దలెవరూ నమ్మబోరని వైసీపీ ఎంపీలు అన్నారు.
రాళ్లు వేయించి.. కాళ్ల బేరాలా?
గతంలో మోదీకి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాలకు వెళ్లి డబ్బులు సరఫరా చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కేవలం కేసుల నుంచి తప్పించుకునేందుకే బీజేపీ పంచన చేరాలని ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఎంపీ బాలశౌరి ఆరోపించారు. మోదీ కుటుంబ గురించి దారుణంగా మాట్లడిన చంద్రబాబు.. అమిత్ షాపై తిరుపతిలో రాళ్లదాడి చేయించారని, ఇప్పుడు రంగు మార్చి కాళ్ల బేరానికి వచ్చినట్లు నటిస్తున్నారని ఎంపీ మండిపడ్డారు. వైసీపీ ఎంపీలు కూడా త్వరలోనే అమిత్ షాను కలిసి.. ఓటు కు నోటు కేసులో చంద్రబాబు పాత్రకు సంబంధించిన ఆధారాలను అందజేసి, సీబీఐ దర్యాప్తు కోరతామని బాలశౌరి చెప్పారు.
టీడీపీ కుయుక్తులు సాగవు..
ఆలయాలపై దాడుల కేసుల్లో టీడీపీ నేతల ప్రమేయం ఉందని ఆధారాలతో సహ బహిర్గతమైందని, అమరావతిలో చంద్రబాబు భూ కుంభకోణంపైనా ఆధారాలు లభించాయని, నాడు ప్యాకేజీకి ఒప్పుకొని పోలవరం ప్రాజెక్టును తాకట్టుపెట్టారని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. ఏపీలో పంచాయితీ ఎన్నికల సందర్భంగా అధికారులను చంద్రబాబు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా గెలుపు మాత్రం వైసీపీదే అని బోస్ అన్నారు. అంతర్వేది ఘటనపై ఏపీ సర్కారు వెంటనే స్పందించి, కొత్త రథాన్ని చేయించిందని, ఈ విషయంలో కొందరు కేంద్రానికి తప్పుడు సమాచారం అందిస్తున్నారని మరో ఎంపీ చింతా అనురాధ అన్నారు. ఇక..
త్వరలోనే జైలుకు చంద్రబాబు..
గత ప్రభుత్వంలో నాలుగేళ్లే కేంద్రంతో కలిసుండి, ఏపీకి అన్యాయం చేసి, చివరి రోజల్లో బయటికొచ్చి, ప్రధాని మోదీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఎవరూ మర్చిపోలేదని, కాబట్టే ఆయనను ఢిల్లీలో యూటర్న్ బాబు అని పిలుస్తారని రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఎద్దేవా చేశారు. టాయిలెట్ల కోసం గుడులు కూలగొట్టి, రాజకీయాల కోసం దేవతా విగ్రహాలన ధ్వంసం చేస్తోన్న చంద్రబాబును, టీడీపీని ప్రజలంతా బహిష్కరించాలని భరత్ పిలుపునిచ్చారు. ఇక మరో ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో.. కుప్పం పంచాయితీ స్థానంలోనూ వైసీపీ గెలుస్తుందని, చంద్రబాబు తొందర్లోనే జైలుకు పోతాడని జోస్యం చెప్పారు.
మరుపురాని ప్రయాణం మళ్లొచ్చె -హైదరాబాద్లో 25 డబుల్ డెక్కర్ బస్సులు -రూట్లివే -ముహుర్తం ఎప్పుడంటే