అనంతపురంపై వైసీపీ దృష్టి: బాలకృష్ణపై బెంగళూరు వ్యక్తి పోటీ చేస్తారా?
అనంతపురం: సార్వత్రిక ఎన్నికలకు మరో రెండు నెలల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. పలు నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశముంది. గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారిలో పలువురు టీడీపీలో చేరడం, పోటీ చేసి ఓడిపోయిన వారికి బలం లేకపోవడం వంటి కారణాలతో కొత్త ముఖాలను తెరపైకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
10 స్థానాల్లో గెలుపుపై వైసీపీ దృష్టి
గత సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో వైసీపీ తక్కువ అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు కనీసం ఎనిమిది నుంచి పది స్థానాల్లో గెలవడంపై దృష్టి సారించింది. హిందూపురం, మడకశిర, కళ్యాణదుర్గం వంటి నియోజకవర్గాల్లో కొత్త ముఖాలు వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఉరవకొండ నుంచి ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉందట. మడకశిరకు ఎమ్మెల్యే తిప్పేస్వామి ఉన్నారు.
బాలకృష్ణను ఎదుర్కొనేందుకు రంగంలోకి కొత్త వ్యక్తి
శింగనమలకు ఇంచార్జిగా పద్మావతి ఉన్నారు. హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేతిలో నవీన్ నిశ్చల్ ఓడిపోయారు. ఆయన ఇంచార్జిగా ఉన్నారు. ఇటీవల టీడీపీ మాజీ ప్రజాప్రతినిధి అబ్దుల్ ఘని వైసీపీలో చేరారు. దీంతో టిక్కెట్ విషయంలో చర్చ సాగుతోంది. అంతేకాదు, మరో నేత కూడా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బాలకృష్ణను ధీటుగా ఎదుర్కొనేందుకు బెంగళూరుకు చెందిన ఓ మైనార్టీని తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.
వీరు ఇంచార్జులు
అనంతపురం నుంచి అనంత వెంకట్రామి రెడ్డి, రాప్తాడు నుంచి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, పుట్టపర్తి నుంచి శ్రీధర్ రెడ్డి, హిందూపురం నుంచి అబ్దుల్ ఘని, నవీన్ నిశ్చల్, మడకశిర నుంచి తిప్పేస్వామి, ఉరవకొండ నుంచి విశ్వేశ్వర రెడ్డి, రాయదుర్గం నుంచి కాపు రామచంద్రా రెడ్డి, ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి, గుంతకల్ నుంచి వెంకటరామిరెడ్డి, తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి, శింగనమల నుంచి పద్మావతి, కదిలి నుంచి సిద్ధా రెడ్డి, కళ్యాణదుర్గం నుంచి ఉషా శ్రీచరణ్, పెనుగొండ నుంచి శంకర నారాయణలు ఇంచార్జులుగా ఉన్నారు.