మళ్లీ బుక్కైన నారా లోకేశ్.. సభలో ఆ పనేంటని వైసీపీ ఫైర్
Recommended Video
అయినదానికి, కానిదానికి రచ్చ చేయడం రాజకీయ నేతలకు అలవాటైన పని. తప్పు ఉన్నా, లేకున్నా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ విషయంలో అధికార వైసీపీది కూడా అదే ధోరణి. వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా బుధవారం శాసన మండలిలోనూ అధికార పక్షం మరోసారి లోకేశ్ ను టార్గెట్ చేసింది. లోకేశ్ సెల్ ఫోన్ వాడటాన్ని తప్పుపట్టింది.
అసలేం జరిగిందంటే..
భారీ డ్రామా తర్వాత మండలిలో ఎట్టకేలకు మూడు బిల్లులపై చర్చ మొదలైంది. మెజార్టీని బట్టి ఆయా పార్టీలకు చైర్మన్ సమయాన్ని కేటాయించారు. ముందుగా టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మాట్లాడుతూ.. సీఎం నిర్ణయాలను చీల్చిచెండాడారు. అయితే ఆయన పదే పదే మొబైల్ ఫోన్ చూస్తూ ప్రసంగించడంపై మంత్రి బొత్స అభ్యంతరం తెలిపారు. సభలో సెల్ ఫోన్ వాడటమేంటని నిలదీశారు.
సెల్ ఫోన్ వాడొద్దా?
మండలిలో లోకేశ్ మొబైల్ ఫోన్ వాడకంపై వెంటనే రూలింగ్ ఇవ్వాలని మండలి వైస్ చైర్మన్ ను మంత్రి బొత్స కోరడం కలకలం రేపింది. ఇంత చిన్న విషయానికి రూలింగ్ ఏంటని విపక్ష ఎమ్మెల్సీలు వాపోయారు. దీనిపై పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం జోక్యం చేసుకుంటూ.. మండలిలో వైఫై సౌకర్యం అందుబాటులో ఉన్నప్పుడు, మొబైల్ ఫోన్ లో ఇంపార్టెంట్ నోట్స్ చూస్తూ మాట్లాడటంలో తప్పేముందని అన్నారు. దీంతో వివాదం సర్దుమణిగింది.
లోకేశ్ కీలక ప్రసంగం..
సెల్ ఫోన్ వివాదం ముగిసిన తర్వాత టీడీపీ ఎమ్మెల్సీ లోకేశ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. సీఎం జగన్ ఏనాడూ అమరావతి ప్రాంతంలో పర్యటించలేదని, అలాంటప్పుడు ఇక్కడ అభివృద్ధి జరగలేదని ఎలా అంటారని ప్రశ్నించారు. రాజధాని తరలింపు వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు.
సౌతాఫ్రికా ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉంటే మంచిదని కేంద్ర ప్రభుత్వం సూచించినా ఏపీలో వైసీపీ సర్కారు మాత్రం పట్టించుకోవడంలేదని లోకేశ్ మండిపడ్డారు. ‘‘మూడు రాజధానుల విషయంలో సౌతాఫ్రికా మోడల్ ను ఫాలో అవుతున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ అదే సౌతాఫ్రికా ప్రెసిడెంట్.. మూడు రాజధానుల వల్ల ప్రజల డబ్బులు వేస్టవుతాయని చెప్పిన సంగతి మనం గుర్తుంచుకోవాలి''అని వివరించారు.
సీఎంను తుగ్లక్ అనొద్దన్న మంత్రి అవంతి..
అమరావతిలో సీఎం జగన్ పర్యటించలేదన్న నారా లోకేశ్ ఆరోపణలకు మంత్రి అవంతి శ్రీనివాస్ బదులిచ్చారు. టీడీపీ వాళ్లు ఎంతసేపూ సింగపూర్ అమెరికా అంటూ పైకి కబుర్లు చెప్పి, లోలోన భూదందాలు చేశారని, వైసీపీ సర్కారు మాత్రం అన్ని ప్రాంతాలు ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో వికేంద్రీకరణ బిల్లు తెచ్చామని చెప్పారు. మంత్రి అవంతికి టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అడ్డుతగులుతూ.. సీఎంపై విమర్శలు చేశారు. సీఎంను తుగ్లక్ తో పోల్చడం, పదేపదే ఆ మాట అనడం భావ్యం కాదని మంత్రి అవంతి ఫైరయ్యారు.