జగన్ కు వచ్చిన విరాళాలు..పీకేకు చెల్లించిందెంత: వైసీపీ..టీడీపీ రెండు పార్టీల బ్యాలెన్స్ ఇదే..!
ఏపీలో 2019 ఎన్నికల్లో విజయం సాధించేందుకు జగన్ ..ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవల కోసం ఒప్పందం చేసుకున్నారు. దీని మేరకు జగన్ నవరత్నాల ప్రకటన నుండి పాదయాత్ర..ఎన్నికల వ్యూహాల్లోనూ పీకే తోడ్పాటు అందించారు. జగన్ 151 అసెంబ్లీ సీట్లు..22 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు. అయితే, ప్రశాంత్ కిషోర్ తో జగన్ వందల కోట్లతో కాంట్రాక్ట్ చేసుకున్నారంటూ టీడీపీ పలుమార్లు ఆరోపించింది. అయితే, ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎన్నికల సమయంలో ఏ పార్టీ ఏ మేరకు చెల్లింపులు చేసిందీ..పార్టీల నగదు బ్యాలెన్స్ ఎంత అనే విషయాలు అధికారికంగా ప్రకటించాయి.
ప్రశాంత్ కిశోర్ కు చెల్లించింది రూ.37.57 కోట్లు
వైసీపీ ఎన్నికల ఖర్చులో బాగంగా ప్రశాంత్ కిశోర్ కు తమకు అందిచిన రాజకీయ సేవల కోసం రూ.37.57 కోట్లు చెల్లించింది. వైసీపీ ఎన్నికల వ్యవ నివేదికలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల సంఘానికి పార్టీ ఈ నివేదిక సమర్పించింది. ప్రశాంత్ కిశోర్ టీం రెండేళ్ల పాటు జగన్ కు నవరత్నాల రూపకల్పనలో..ఆ తరువాత పాదయాత్ర సమయంలో..ఇక, అభ్యర్ధుల ఎంపిక..సామాజిక సమీకరణాలు.. ప్రచార వ్యూహాల్లో తమ వంతు సాయం అందించింది. జగన్ నిర్వహించిన 3,648 కిలో మీటర్ల పాదయాత్ర ఎక్కడ జరగాలి..ప్రజల ఫీడ బ్యాక్ వంటి అంశాల పైన ఎప్పటికప్పుడు సూచనలు..సలహాలు ఇస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి సహకరించింది.
జగన్ కు విరాళాలు రూ.221 కోట్లు..బ్యాంకు బ్యాలెన్స్..138 కోట్లు
వైసీపీ కి వివిధ మార్గాల ద్వారా రూ.221 కోట్ల నిధులు సమకూరాయి. అందులో ప్రచారం కోసం 85 కోట్లు ఖర్చు చేసారు. 36 కోట్ల రూపాయాలు ప్రకటనల కోసం వినియోగించినట్లు పార్టీ వివరించింది. అందులో కేవలం జగతి పబ్లికేషన్స్ కోసమే రూ 24 కోట్లు ఖర్చు పెట్టింది. పార్టీ కోసం ప్రచారం చేసిన స్టార్ క్యాంపెయినర్స్ కోసం రూజ 36 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు అందించింది.
ఇక, ప్రచార సామాగ్రి.. రవాణా కోసం ఎంత ఖర్చు చేసిందీ..వైసీపీ ఆ నివేదికలో స్పష్టం చేసింది. ఎన్నికలు పూర్తయ్యే సమయానికి అన్ని ఖర్చులు మినహాయించగా..బ్యాంకులో పార్టీ నగదు నిల్వ రూ. 138 కోట్లుగా చూపించారు. వైసీపీకి వచ్చిన నిధుల్లో కార్పోరేట్ సంస్థల నుండి 18 కోట్లు విరాళాలు వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఎలకట్రోల్ బాండ్ల రూపంలో 99 కోట్లు వైసీపీకి విరాళంగా అందాయి.
టీడీపీ ఖర్చు రూ. 77 కోట్లు..నిల్వ రూ. 155 కోట్లు
ఏపీలో వైసీపీతో పోటీ పడిన ప్రధాన పార్టీగా ఉన్న తెలుగు దేశం ఎన్నికల కోసం మొత్తం రూ. 77 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదించింది. అందులో కేవలం మీడియాలో ప్రచారం కోసమే కూ. 77 కోట్లు ఖర్చు చేసినట్లు గా వివరించారు. ఎన్నికలు పూర్తయ్యే సమయానికి తెలుగు దేశం వద్ద నగదు నిల్వ రూ. 155 కోట్లుగా అధికారికంగా ఎన్నికల సంఘానికి నివేదించిన లెక్కల్లో పార్టీ స్పష్టం చేసింది.
ఏపీలో వైసీపీ..టీడీపీ మధ్యనే ప్రధానంగా పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. వైసీపీ ప్రధానంగా ఐ ప్యాక్ కోసం ఖర్చు చేయగా..టీడీపీ మాత్రం మీడియాలో ప్రచారారిని పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది.