పేరుకు మాత్రమే అశోక గజపతి: నడిపిందంతా కుటుంబరావే: మన్సాస్ను నాకేశారు: సాయిరెడ్డి
అమరావతి: విజయనగరం జిల్లాలో గజపతి రాజు కుటుంబానికి చెందిన మన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై కొద్దిరోజులుగా చెలరేగుతోన్న వివాదాలకు తెర పడట్లేదు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి అశోక గజపతి రాజును తొలగించి ఆయన స్థానంలో మన్సాస్ ట్రస్ట్ ఛైర్పర్సన్ బాధ్యతలను సంచైత గజపతిరాజుకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేయడంతో ఆరంభమైన రాజకీయ విమర్శలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఘట్టమనేని ఘర్ వాపసీ?: విజయసాయి రెడ్డితో ఆదిశేషగిరి రావు భేటీ: భిన్నాభిప్రాయాలకు
పూర్వీకుల నుంచి నిర్వహిస్తున్న మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులను ఆక్రమించడానికి కుట్ర పన్నారని, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలు సంచైతను దొడ్డిదారిన చైర్మన్ను చేశారంటూ అశోక గజపతిరాజు చేసిన ఆరోపణలపై కౌంటర్ అటాక్ పడుతోంది. ఇదివరకు సంచైత.. ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు చేస్తున్నారు. అశోక గజపతిరాజు సోదరుడు ఆనంద గజపతిరాజు కుమార్తె సంచైతను నియమించడాన్ని తప్పుపట్టడంలో అర్థమే లేదని మండిపడుతున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం హయాంలో మన్సాస్ ట్రస్ట్ భూములను ఆక్రమించడానికి పెద్ద ఎత్తున కుట్ర పన్నారని సాయిరెడ్డి ఆరోపించారు. అశోక గజపతిరాజును పేరుకు మాత్రమే మన్సాస్ ట్రస్ట్కు ఛైర్మన్గా పెట్టిన చంద్రబాబు.. ట్రస్టీలుగా తన విశ్వాసపాత్రులను నియమించారని గుర్తు చేశారు. ఆర్థికశాఖ మాజీ సలహదారు, షేర్ కన్సల్టెంట్ కుటుంబరావును మన్సాస్ ట్రస్ట్ సభ్యుడిగా ఎందుకు నియమించారో అర్థం చేసుకోలేని స్థాయి అశోక గజపతిరాజుకు లేదని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
కుటుంబరావుతో పాటు ఎన్టీ రామాారావు హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఐవీ రావును ఏ ఉద్దేశంతో మన్సాస్ ట్రస్ట్ సభ్యులుగా నియమించారని ప్రశ్నించారు. ట్రస్టుకు ఏ మాత్రం సంబంధం లేని, తన సామాజిక వర్గానికే చెందిన కుటుంబ రావు, ఐవీ రావులను చంద్రబాబు సభ్యులుగా నియమించినప్పుడే దోపిడీకి బీజం పడిందని సాయిరెడ్డి ఆరోపించారు. మన్సాస్ ట్రస్టు భూములను కేకు ముక్కలా నాకేస్తాడనే విషయం వారిద్దరినీ నియమించడంతోనే అర్థమైందని అన్నారు. కెలికి మరీ తిట్టించుకోవడం చంద్రబాబుకు బాగా అలవాటు అని సాయిరెడ్డి చురకలు అంటించారు.