డొక్కా మాణిక్య వరప్రసాద్తో వైసీపీ బోణీ: రేసులో లేని టీడీపీ: మండలి ఇక ఏకపక్షమే: కాస్సేపట్లో
అమరావతి: శాసన మండలిలో తన బలాన్ని పెంచుకునే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి అడుగు వేయబోతోంది. అసెంబ్లీలో భారీగా మెజారిటీ ఉన్నప్పటికీ.. శాసన మండలిలో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన వైఎస్ఆర్సీపీ..ఇక ముందు నిర్వహించబోయే ఎన్నికలను ఏకపక్షంగా మార్చుకోబోతోంది. దీనికి మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్తో బోణీ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కౌన్సిల్ ఎన్నికల్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి గురువారం చివరిరోజు.
పదేళ్లుగా వివక్ష.. సీమను చూసి వైఎస్ఆర్ చలించారు...పట్టించుకొనే నాథుడేడీ.. వైఎస్ జగన్ ఆవేదన
డొక్కా ఖాళీని డొక్కాతోనే భర్తీ..
వైసీపీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ కాస్సేపట్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయట్లేదు. ఆ పార్టీ తగిన బలం లేకపోవడమే దీనికి కారణం. మరెవరూ నామినేషన్ పత్రాలను దాఖలు చేయకపోతే- డొక్కా ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన స్థానాన్ని ఆయనతోనే భర్తీ కాబోతోంది. ఒక్క స్థానమే ఖాళీ కావడం, అభ్యర్థిని గెలిపించుకునేంతటి బలం లేకపోవడం వల్ల మిగతా పార్టీలు నామినేషన్ల ప్రక్రియకు దూరం అయ్యాయి.
టీడీపీ నుంచి వైసీపీలోకి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డొక్కా మాణిక్యవర ప్రసాద్ సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందారు. రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో ఆయన కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యారు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు.
రాజధాని ఉద్యమ సమయంలో..
రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా రాజధాని అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున నిరసనలను వ్యక్తం చేస్తోన్న వేళ ఆయన టీడీపీ నుంచి బయటికి వచ్చారు. మార్చి 9వ తేదీన డొక్కా మాణిక్య వరప్రసాద్ తన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామనే నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ ఆయన టీడీపీకి గుడ్బై చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అనంతరం ఆయన వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అధికార పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.
Recommended Video
మరో మూడేళ్లు మండలి సభ్యుడిగా..
డొక్కా మాణిక్య వరప్రసాద్ మరో మూడేళ్ల పాటు శాసన మండలి సభ్యునిగా కొనసాగుతారు. 2023 మార్చి 29వ తేదీన ఆయన పదవీ కాలం ముగుస్తుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. గురువారం నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ కాగా.. శుక్రవారం నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. 29 వరకు నామినేషన్లు విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. వచ్చేనెల 6 తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లను లెక్కిస్తారు. ఒకే నామినేషన్ దాఖలైతే ఆయన ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది.