రఘురామకు మరో ఝలక్ - జగన్ సన్నిహితుడికి ఛాన్స్ - స్పీకర్ తో భేటీ మర్మమిదే..
ఓ రాజకీయ పార్టీ తరఫున గెలిచి స్వప్రయోజనాల కోసం ఆ పార్టీతో ఏడాదిలోనే విభేదిస్తే ఎలా ఉంటుందో రఘురామకృష్ణంరాజుకు అన్ని విధాలా తెలియజేయాలని వైసీపీ భావిస్తోంది. వైసీపీతో విభేదించాక తనపై బహిష్కరణ వేటు వేస్తారని, దాంతో సులువుగా బీజేపీలో చేరిపోవచ్చని కలలుకన్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అనర్హత వేటు వేయించాలన్న జగన్ వ్యూహంతో ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. అంతటితో ఆగకుండా పార్టీ ద్వారా ఆయనకు సంక్రమించిన అన్ని రకాల ప్రయోజనాలకు గండి కొట్టే దిశగా వైసీపీ పక్కా వ్యూహంతోనే ముందుకెళ్తోందని తాజా పరిణామాలతో అర్దమవుతోంది.
ఢిల్లీలో రఘురామకృష్ణంరాజు- వైసీపీ నుంచి రక్షించాలని కేంద్రానికి వేడుకోలు...
రఘురామ వ్యవహారం- మిగతా వారికి గుణపాఠం..
2014లో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి వారంలోపే టీడీపీలోకి ఫిరాయించేశారు. ఆ తర్వాత అరకు నుంచి గెలిచిన కొత్తపల్లి గీత కూడా ఎస్పీవై రెడ్డి బాటలోనే పయనించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిసి వీరిపై వేటు వేయాలని కోరినా అది సాధ్యం కాలేదు. అప్పట్లో టీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉండటంతో వీరిపై వేటు పడకపోయినా ఎంపీలు తప్ప మిగతా పదవుల్లో మాత్రం కొత్తపల్లి గీత చోటు కోల్పోయారు. కానీ ఇప్పుడలా కాదు భారీ మెజారిటీతో ఇటు అసెంబ్లీలోనూ, అటు పార్లమెంటులోనూ చక్రం తిప్పుతున్న పార్టీ వైసీపీ. సాధారణంగా అయితే ఇలాంటి పరిస్ధితుల్లో వైసీపీ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయించాలని భావించరు. కానీ అలా చేస్తే రఘురామకృష్ణంరాజు ఎందుకవుతారు. తాను ఎంచుకున్న ప్రత్యామ్నాయం బీజేపీ కాబట్టి ఎలాగైనా తన వ్యూహమే గెలుస్తుందన్న భావన ఆయనది. కానీ అది వాస్తవం కాదని నిరూపించేందుకు ఇప్పుడు వైసీపీ సిద్దమవుతోంది. అదే సమయంలో ఇది పార్టీలో తోక జాడించాలనుకునే మిగిలిన వారికీ గుణపాఠంలా ఉండాలని అధినేత జగన్ కోరుకుంటున్నారు.
రఘురామకు ఒక్కొక్కటిగా ఝలక్ లు...
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీతో విభేదించి ఏకంగా కేంద్ర హోంశాఖ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లానే రక్షణ ఇవ్వాలని కోరిన రఘురామకృష్ణంరాజు వ్యవహారాన్ని అంత సులువుగా వదిలిపెట్టరాదని జగన్ భావిస్తున్నారు. అందుకే ఇప్పటికే ఆయనపై ఎంపీగా వేటు వేయాలని కోరిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు... అంతకు ముందే పార్టీ ద్వారా సంక్రమించిన పదవుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరారు. ఎంపీగా వేటు వేయాలంటే నిబంధనల ప్రకారం విచారణ, ఇతర ఫార్మాలిటీలు పూర్తి చేయాల్సి ఉండటంతో అంతకు ముందే రఘురాముడికి వైసీపీ ద్వారా సంక్రమించిన అన్ని పార్లమెంటరీ పదవుల నుంచి తొలగించబోతున్నారు. ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు పార్లమెంటు సబార్డినేట్ లెజిస్టేషన్స్ కమిటీ ఛైర్మన్ గానూ, పబ్లిక్ అండర్ టేకింగ్స్, కోల్ స్టీల్స్, జనరల్ పర్పస్, రూల్స్ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. వీటన్నింటి నుంచి ఆయన్ను ముందుగా తప్పించాలని వైసీపీ స్పీకర్ ను కోరింది.
వైసీపీ వాదనకే స్పీకర్ మద్దతు..
పార్లమెంటరీ కమిటీల తరఫున ఇచ్చే పదవులకు ఎంపీలు గెలిచిన రాజకీయ పార్టీల నుంచి వచ్చే ప్రతిపాదనలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. పార్టీలు సూచించిన వారినే స్పీకర్ కమిటీ పదవుల్లో నియమిస్తారు. తాజాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతలు ఆయన్ను కలిసినప్పుడు ఇదే విషయాన్ని స్పీకర్ ఓం బిర్లా వారికి స్పష్టం చేశారు. మీరు ఇచ్చిన పేర్ల ఆధారంగానే తాము నియామకాలు చేశామని, ఇప్పుడు వద్దంటే వారి స్ధానంలో మరొకరి పేరు సూచించవచ్చని స్పీకర్ వైసీపీ ఎంపీల బృందానికి స్పష్టం చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా వైసీపీ అభ్యర్ధన మేరకు రఘురామకృష్ణంరాజును ఎంపీ పదవి కంటే ముందుగానే పార్లమెంటరీ పదవుల నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Recommended Video
జగన్ సన్నిహితుడికి ఛాన్స్....
వైసీపీ తరఫున పార్లమెంటరీ పదవులు అనుభవిస్తున్న రఘురామకృష్ణంరాజును తొలగించాలని కోరిన వైసీపీ పార్లమెంటరీ నేతల బృందం.. ఆయన స్దానంలో మచిలీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో ఎంపీ వల్లభనేని బాలశౌరికి అవకాశం ఇవ్వాలని కోరారు. అధినేత జగన్ కు సన్నిహితుడుగా పేరున్న బాలశౌరికి ఢిల్లీ వర్గాల్లోనూ మంచి పట్టుంది. పార్టీ తరఫున కీలక ఎంపీల్లో ఒకరైన బౌలశౌరి ప్రస్తుతం ఇతర పార్లమెంటరీ కమిటీ పదవుల్లోనూ కొనసాగుతున్నారు. అయినప్పటికీ అధినేత జగన్ సూచన మేరకు రఘురామకృష్ణంరాజు స్ధానంలో బాలశౌరిన్ నియమించాలని స్పీకర్ ఓం బిర్లాను వైసీపీ ఎంపీల బృందం కోరింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ వారికి హామీ ఇచ్చారు.