'శశికళకు పట్టిన గతే జగన్కు', ఉసిగొలిపింది చంద్రబాబే!, కేసులపై రోజా ధర్నా
తమిళనాడులో అక్రమాస్తుల కేసులో శశికళకు పట్టిన గతే ఏపీలో జగన్ కు పడుతుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు.
నందిగామ: నందిగామ ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ తో వాగ్వాదం నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ పై క్రిమినల్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. టీడీపీ నేతలంతా జగన్ తీరుపై ఇప్పటికే పలు విమర్శలు గుప్పిస్తుండగా తాజాగా ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దీనిపై స్పందించారు.
క్రిమినల్ కేసులు నమోదు కావడంతో జగన్కు యావజ్జీవ శిక్ష పడటం ఖాయమని ప్రత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు. జగన్ కు కలలో కూడా జైలే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అందువల్లే కనిపించిన ప్రతీ ఒక్కరిని జైలుకు పంపుతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. పిడుగురాళ్లలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
శశికళకు పట్టిన గతే జగన్ కు:
జగన్ చేసిన తప్పులకు కోర్టులు ఆయనకు జీవితకాలం శిక్ష విధిస్తాయని మంత్రి ప్రత్తిపాటి అన్నారు. తమిళనాడులో అక్రమాస్తుల కేసులో శశికళకు పట్టిన గతే ఏపీలో జగన్ కు పడుతుందని హెచ్చరించారు. గుంటూరు జిల్లాకు సీఎం చంద్రబాబు ఎంతో చేస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలిచి ఆయనకు బహుమతిగా ఇవ్వాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
జగన్పై కేసులను నిరసిస్తూ రోజా ధర్నా:
కలెక్టర్ తో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో జగన్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని వైసీపీ శ్రేణులు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఇందుకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు రోజా, భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
స్థానిక భవానీ నగర్ సర్కిల్ వద్ద బైఠాయించిన కార్యకర్తలు నల్లబాడ్జీలు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా జగన్ పై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఈ సందర్బంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి బుద్ది చెప్పడం ఖాయమని ఎమ్మెల్యే రోజా తేల్చి చెప్పారు.
అలాంటిది!?
ఈరోజుల్లో ఒక పక్షినో, జంతువునో హింసిస్తేనే కేసులు పెడుతున్నారని, అలాంటిది 11మంది మృతికి కారణమైన దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యం మీద కేసులు ఎందుకు పెట్టడం లేదని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు.
చనిపోయిన డ్రైవర్ కు పోస్టుమార్టం నిర్వహించకుండా, రెండో డ్రైవర్ ను అరెస్టు చేసి వివరాలు రాబట్టకుండా ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు.
చంద్రబాబే ఉసిగొలిపారు:
తనకు అనుకూలంగా పనిచేసే కలెక్టర్ ను, అధికారులను ఉద్దేశపూర్వకంగానే సీఎం చంద్రబాబు జగన్ పై ఉసిగొలిపారని రోజా ఆరోపించారు. రోడ్డు ప్రమాద విషయంలో ఏపీ ఐదో స్థానంలో ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందన్నారు.
జగన్ మీడియాతో మాట్లాడుతుంటే.. ఆయన వద్దకు వెళ్లి మరీ దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం కలెక్టర్ కు ఏమొచ్చిందని రోజా ప్రశ్నించారు. కలెక్టర్, డాక్టర్ కలిసి ప్రతిపక్ష నేతను అవమానించాల్సిన అవసరమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.