అగ్రిగోల్డ్ పాపం వైయస్దే: 'దొంగలు పడ్డ ఆర్నేళ్లకు జగన్ స్పందించారు'
హైదరాబాద్: ఏపీ శాసనసభా సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభానికి ముందే అగ్రిగోల్డ్ బాధితులు, వారికి న్యాయం చేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. అనంతరం సభలో వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ సభ్యులు ప్టటుబట్టారు.
అయితే ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ముగిసిన తర్వాత అగ్రిగోల్డ్ అంశాన్ని చర్చిద్దామని స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రశ్నించారు. దీంతో స్పీకర్ కోడెల "ప్లీజ్ కూర్చోండి. యూ విల్ బీ శాటిస్ ఫైడ్ (మీరు సంతోషపడతారు). మీ తీర్మానంపై సమయం వచ్చినప్పుడు చెబుతాను. బీఏసీలో మీరే అంగీకరించారు. ఇప్పుడిదేంటి? ప్లీజ్... దయచేసి కూర్చోండి. ఈ విషయంలో అందరం సీరియస్ గానే ఉన్నాము. కానీ రావాల్సిన పద్ధతిలో రావాలి. యూ కెనాట్ డిక్టేట్ ది చైర్. సహకరించండి. మీరు ఒప్పుకున్న నియమాన్ని మీరే ఉల్లంఘిస్తే ఎలాగండీ?" అని ప్రశ్నోత్తరాలు కొనసాగించారు.
బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు సభలో చర్చ జరుగుతుందని స్పీకర్ పదే పదే చెప్పారు. సభా సమయాన్ని వృథా చేయొద్దంటూ స్పీకర్ ప్రతిపక్ష సభ్యులను కోరారు. అయినప్పటికీ... వాయిదా తీర్మానంపై చర్చను ప్రారంభించాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టి గట్టిగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.
ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీకి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని అన్నారు. అగ్రిగోల్డ్ను వైయస్ రాజశేఖరరెడ్డే పెంచి పోషించారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో 9 వేల కోట్ల రూపాయల డిపాజిట్లను అగ్రిగోల్డ్ సంస్థ సేకరించిందని పేర్కొన్నారు.
దొంగలు పడ్డ ఆర్నేళ్లకు అన్నట్లు ఇప్పుడు వైయస్ జగన్ స్పందించారని బొండా ఉమ ఎద్దేవా చేశారు. 2003 దాకా అగ్రిగోల్డ్ వ్యాపారం విలువ రూ.100 కోట్లు కూడా దాటలేదన్న బొండా ఉమా, వైఎస్ అధికారం చేపట్టగానే ఆ సంస్థ నలుదిశలా విస్తరించిందని ఆరోపించారు. అంతేకాక అనతి కాలంలోనే ఆ సంస్థ వ్యాపారం వేల కోట్లకు చేరిందన్నారు.
వైఎస్ అండ చూసుకునే... అగ్రిగోల్డ్ చైర్మన్ ఏవీ రామారావు చక్రం తిప్పారన్నారు. అయితే తాము అధికారంలోకి రాగానే జనాన్ని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ పై కేసులు నమోదు చేశామన్నారు. ఎక్కడెక్కడో ఉన్న సంస్థ ఆస్తులను గుర్తించి సీజ్ చేశామని ఆయన పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ విషయంలో ప్రభుత్వం నిప్షక్షపాతంగా దర్యాప్తు చేస్తోందని అన్నారు.
మరోవైపు ప్రతిపక్షం సభను సజావుగా జరిపేందుకు సహకరించాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ప్రశ్నోత్తరాలు, జోర్ అవర్ తర్వాత చర్చిద్దామని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు కోరారు. అయినా వైసీపీ సభ్యులు అగ్రి గోల్డ్ పై చర్చించాలని పట్టుబట్టారు. వైసీపీ సభ్యుల ఆందోళనతో స్పీకరు కోడెల అసెంబ్లీని 5 నిమిషాల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.