లోకేష్! జూబ్లీహిల్స్ బిల్డింగ్ విలువ అంతేనా, మీ ఆస్తి ఇంతేనా: వైసిపి ఆశ్చర్యం
గుంటూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన కుటుంబ ఆస్తులను బుధవారం నాడు ప్రకటించారు. ఆయన ఆస్తుల ప్రకటనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఆయన చెప్పినట్లుగా కొన్ని ఆస్తుల విలువ అంతేనా అని నిలదీసింది.
బుధవారం ఎంపీ మిథున్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతం జూబ్లీహిల్స్ అని, అలాంటి ప్రాంతంలో ఉన్న చంద్రబాబు ఇల్లు విలువ రూ.3 కోట్లే ఉంటుందా అని నిలదీశారు.
అవినీతికి మూలమైన పెదబాబు (చంద్రబాబు), చినబాబు (లోకేష్)ల ఆస్తులు ఇంతేనా ఆని ఆశ్చర్యం ప్రకటించారు. మీరు ప్రకటించిన ఆస్తులకు మరో 50 శాతం కలిపి ఇస్తామని, ఆ డబ్బును మీరు మోసం చేసిన డ్వాక్రా మహిళలకు పంచగలరా అని సవాల్ చేశారు.
చంద్రబాబు బెదిరింపులకు భయపడం: పిన్నెల్లి
వైసిపి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి స్పందించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడితే తమకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని ధ్వజమెత్తారు. తమను చంద్రబాబు ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం జగన్ ఆధ్వర్యంలో ఎంత దాకానైనా పోరాడుతామన్నారు.
కాగా, 12 మంది వైసిపి ఎమ్మెల్యేలకు ఏపీ శాసన సభ హక్కుల కమిటీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. త్వరలో జరగనున్న కమిటీ సమావేశానికి హాజరై అభిప్రాయాలు వెల్లడించాలని ఆదేశించారు. 25వ తేదీన ఆరుగురు, 26వ తేదీన మరో ఆరుగురు కమిటీ ముందు హాజరు కావాలని పేర్కొంది.