మీ మైండ్ కంట్రోల్ తప్పింది.. మానసిక చికిత్స చేయించుకోండి: చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చిన సాయిరెడ్డి
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి మరోసారి తన వ్యాఖ్యలకు పదును పెట్టారు. తనదైన శైలిలో విమర్శలు చేస్తూ, చంద్రబాబుపై విరుచుకు పడ్డారు. పోలింగ్ ప్రక్రియను తప్పు పడుతూ, ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తనకు ప్రతికూలంగా ఉన్న ప్రతి ఒక్క వ్యవస్థనూ చంద్రబాబు తప్పు పడుతున్నారని, ఇది ఆయన వైఖరికి నిదర్శనమని అన్నారు. గతంలో సీబీఐ, ఈడీ, ఏసీబీల పనితీరుపై ఆరోపణలు చేసిన చంద్రబాబు తాజాగా దేశ ఎన్నికల ప్రక్రియను విమర్శించడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఆయన మానసిక అసమతౌల్యానికి ఇది నిదర్శనమని చెప్పారు.
శుక్రవారం చంద్రబాబు విలేకరుల సమావేశంలో చేసిన కొన్ని ప్రకటనలపై విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియలో తాను సంస్కరణలను తీసుకొస్తానని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఓ కోవర్ట్ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలకు ఎన్నికల ప్రక్రియ మూలస్తంభమని, ఇందులో సంస్కరణలను తీసుకొస్తానంటూ చంద్రబాబు చెప్పడం ఆయన చిత్త చంచలానికి నిదర్శనమని సాయిరెడ్డి విమర్శించారు. తనకు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని తేలటం వల్లే చంద్రబాబు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
ఈ ఎన్నికలు ఎన్నికలే కావని చంద్రబాబు చెప్పడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించినట్టేనని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారిని కోవర్ట్ గా చెప్పడం.. అధికార యంత్రాంగంలోకి తప్పుడు సంకేతాలను పంపించినట్టయిందని చెప్పారు. నిజాయితీ గల అధికారులను కోవర్ట్ గా చెప్పడం వల్ల వారిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినట్టవుతుందని అన్నారు. ప్రజలు చంద్రబాబు ముఖంపై ఉమ్మేస్తే దాన్ని తుడుచుకుని అధికారులు, ఎలక్షన్ కమిషన్ వెంట పడ్డారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు మైండ్ కంట్రోల్ తప్పిందని చురకలు అంటించారు. దాని ఫలితంగా ఆయన ఏదేదో మాట్లాడుతున్నారని, ఈ డ్రామాలను ఆపేసి, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే దాకా మానసిక చికిత్స తీసుకుంటే బాగుంటుందని అన్నారు.