అనుచరులతో ఆనం మరో భేటీ- రెండునెలల్లో రెడీగా ఉండాలని సూచన-కోర్టు కెళ్దామంటూ..
వైసీపీ అధిష్టానంతో విభేదిస్తున్న నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఇవాళ మరోసారి అనుచరులతో భేటీ అయ్యారు. మరో రెండు నెలల్లో మహత్తర కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలన్నారు.
నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయాల్లో సెగ తగ్గలేదు. ఓవైపు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాకరేపుతుంటే మరోవైపు తానూ ఏం తీసిపోలేదని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కూడా నిరూపించుకుంటున్నారు. ఇదే క్రమంలో ఇవాళ మరోసారి అనుచరులతో భేటీ అయిన ఆనం.. కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ నెల్లూరులో అనుచరులతో భేటీ అయిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మరో రెండు నెలల్లో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు వారికి సంకేతాలు ఇచ్చారు. అందరూ సంఘటితం కావాలని కోరారు. వెంకటగిరి టీడీపీకి చాలా బలమైన నియోజకవర్గమని, వెంకటగిరి మున్సిపల్ ఎన్నికల్లో ఎంతో కష్టపడితే కేవలం 2 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చిందని ఆనం గుర్తుచేశారు. సమస్యలు పరిష్కరించ లేనప్పుడు పదవులు ఎందుకని ప్రశ్నించారు.
సమస్యలు పరిష్కరించాలని కోరడం తప్పా అని అనుచరుల్ని ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నించార. రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని, రావూరు నుంచి వెంకటగిరి వెళ్లాలంటే రెండున్నర గంటలు పడుతోందని ఆనం ఆరోపించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. నన్ను వద్దనుకునే వేరే వాళ్లను పెట్టారని ఆనం తెలిపారు. -ముగ్గురు పరిశీలకులు వచ్చారు వెళ్లారని, ఇప్పుడు నాలుగో కృష్ణుడు వచ్చాడని వైసీపీ ఇన్ ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి ఆనం వ్యాఖ్యానించారు.
2014లో వెంకటగిరి నుంచి పోటీ చేసిన రాంకుమార్రెడ్డి మధ్యలోనే పారిపోయాడని ఆనం రామనారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పుడు నాలుగో కృష్ణుడిలా వచ్చారన్నారు. మూడేళ్ల నుంచి ఎలాంటి నిధులు ఇవ్వలేదని, నిధులు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్దామని అనుచరులతో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.