జగన్ ఎవరెవరికి ఎందుకు లొంగిపోయారంటే?: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల సంచలన లేఖ
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు గురువారం ఘాటైన బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రిసీటు కోసం జగన్ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని విమర్శించారు. అక్రమాస్తుల కేసు నుంచి బయటపడేందుకు బెయిల్ కోసం నాడు సోనియా గాంధీకి అమ్ముడుపోయారని ఆరోపించారు.
ఎవరి లెక్కలు వారివి: 2019 ఎన్నికలకు జగన్-పవన్ కళ్యణ్లది ఒక్కటే లెక్క!
అందుకే లొంగిపోయారు
అలాగే, కాంట్రాక్టుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కుమ్మక్కయ్యారని ధ్వజమెత్తారు. కేసుల మాఫీ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దాసోహం అయ్యారన్నారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూను జగన్ తన పక్క సీటులో కూర్చోవద్దని సైకోయిజం ప్రదర్శించారని ధ్వజమెత్తారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. వారిలో నలుగురు మంత్రులు కూడా అయ్యారు. అఖిలప్రియ, సుజయ కృష్ణ రంగారావు, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలు మంత్రులుగా ఉన్నారు. వైసీపీని వీడి, టీడీపీలో చేరిన ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు లేఖ రాశారు.
అన్నీ అబద్దాలే చెప్పారు
తన ఎన్నికల అఫిడవిట్లో జగన్ అబద్దాలు చెప్పారని రెబల్ ఎమ్మెల్యేలు చెప్పారు. ఇళ్లు, వాహనాలు లేవని అన్నీ అసత్యాలే చెప్పారన్నారు. అలాగే, ప్రజలు సమస్యలను లేవనెత్తుతారని గెలిపిస్తే, అసెంబ్లీకి రాకుండా లక్షలాది రూపాయల జీతాలు తీసుకున్నారని, ఇది కచ్చితంగా ప్రజాద్రోహం అన్నారు. ఆయనో అవినీతి చక్రవర్తి అని ధ్వజమెత్తారు.
నలుగురు సభ్యుల జగన్ ఫ్యామిలీకి వేల కోట్లు ఎందుకు
రూ.43వేల కోట్ల అవినీతి కేసులో జగన్ ఏ1 ముద్దాయిగా ఉన్నారని రెబల్ ఎమ్మెల్యేలు అన్నారు. జగన్ దుష్ట రాజకీయాలు భరించలేకే తాము పార్టీ మారినట్లు తెలిపారు. నాడు గవర్నర్ను కలిశాక, టీడీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని అవాస్తవాలు చెప్పారని, మీ దుర్మార్గపు రాజకీయాలు భరించలేకే పార్టీ మారామన్నారు. జగన్ అవినీతి వల్ల ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి జైలుకు వెళ్లారని వాపోయారు. నలుగురు సభ్యులు ఉండే జగన్ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎందుకని ప్రశ్నించారు.
మోడీని విమర్శించారా?
జగన్ తన ప్రజా సంకల్ప యాత్రలో ఒక్కసారైనా ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించారా అని రెబల్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. మీరు అవినీతి చక్రవర్తి అనేది బహిరంగ రహస్యమని జగన్ను ఉద్దేశించి పేర్కొన్నారు. లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రానికి కేంద్రం సహకరించకపోయినా చంద్రబాబు తన అనుభవంతో కష్టపడి ముందుకు తీసుకు వెళ్తున్నారని చెప్పారు.
అవినీతి సొమ్ముతో పార్టీ
మంత్రి జవహర్ మాట్లాడుతూ... పాదయాత్రలో జగన్ ఒక్కరోజు కూడా మోడీని, కేసీఆర్ను విమర్శించలేదని చెప్పారు. పగలు పాదయాత్ర, రాత్రి మోడీతో జగన్ మంతనాలు అని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి పారిపోయారన్నారు. అవినీతి సొమ్ముతో పార్టీ స్థాపించారన్నారు.